Paratha GST: పరాటా తినాలంటే జేబులో ఎక్కువ డబ్బు ఉందో, లేదో చూసుకోవాల్సిందే. ఎందుకంటే, ఒక్కో పరోటాకు 18 శాతం వస్తు, సేవల పన్ను (GST) కట్టాల్సివుంటుంది. గుజరాత్‌ అప్పిలేట్‌ అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (GAAAR) ఇలా తీర్పు అలాగే ఉంది మరి.


ప్రస్తుతం, ప్యాక్‌ చేసిన చపాతీలకు మనం 5 శాతం జీఎస్‌టీ కడుతున్నాం. పరాటా మీద మాత్రం 18 శాతం జీఎస్‌టీని కేంద్ర ప్రభుత్వం విధించి, ముక్కు పిండకుండానే వసూలు చేస్తోంది. ఇది అన్యాయమని, పరాటాలను కూడా చపాతీ లేదా రోటీ తరహాలోనే గోధుమపిండితో తయారు చేస్తారని, కాబట్టి 5 శాతం జీఎస్‌టీ సరిపోతుందని అహ్మదాబాద్‌కు చెందిన వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌ (Vadilal Industries) వాదించింది. 


కేసు నేపథ్యం
గోధుమ పిండితో పరాటాలు తయారు చేసి అమ్మే బిజినెస్‌ చేస్తోంది వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌. ఇది, మలబార్, మిక్స్‌డ్‌ వెజిటబుల్, ప్లెయిన్‌తో సహా ఎనిమిది రకాల పరోటాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ అన్ని రకాల్లో ఉండే ప్రధాన పదార్థం గోధుమ పిండే కాబట్టి, చపాతీ రేటే వేయాలని ఇది వాదిస్తోంది. కూరగాయలు, ఉల్లిపాయలు లేదా మెంతి వంటి పదార్థాలను కేవలం ఫ్లేవర్‌ కోసమే యాడ్‌ చేస్తామని, అన్ని రకాల పరాటాలు ఒకేలా ఉంటాయని కంపెనీ తెలిపింది. 18 శాతం జీఎస్‌టీ వసూలును సవాలు చేస్తూ గుజరాత్‌ ఏఏఆర్‌ను (GAAR) ఆశ్రయించింది.


అయితే, పరాటాలను ప్యాకెట్‌లో నుంచి తీసిన వెంటనే తినలేమని, వాటిని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేడి చేయాల్సిన అవసరం ఉంటుందని, ప్రధానంగా గోధుమ పిండి ఉత్పత్తులైన రోటీ లేదా చపాతీకి ఇవి సమానం కాదని అధికార యంత్రాంగం వాదించింది. కాబట్టి 18 శాతం రేటును ఆకర్షించే వర్గీకరణ కిందకు పరాటాలు వస్తాయని తెలిపింది. అధికార యంత్రాంగం చెప్పిందే సబబని GAAR స్పష్టం చేసింది. ప్యాక్‌ చేసిన (ప్యాక్డ్‌), శీతలీకరించిన ‍‌(ఫ్రోజెన్‌) పరాటాలకు 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందంటూ 2021 జూన్‌లో ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ GAAARను వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌ ఆశ్రయించింది.


ఎక్స్‌ట్రా వాయింపుడు ఎందుకు?
ఇక్కడ కూడా వాడిగానే వాదనలు వినిపించింది వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌. పరాటాలలాగే చపాతీ లేదా రోటీలను కూడా ప్యాకెట్‌లో నుంచి తీసిన వెంటనే తినలేమని, తినడానికి వీలుగా కాసేపు వేడి చేయాలని వాదించింది. పిజ్జా బ్రెడ్‌ మీద కూడా ఐదు శాతం జీఎస్‌టీనే వసూలు చేస్తున్నారని, దీనిని కూడా వినియోగానికి ముందు వేడి చేయడం లేదా ఉడికించడం అవసరమని స్పష్టం చేసింది. వీటికి లేని ఎక్స్‌ట్రా వాయింపుడు పరాటాలకు ఎందుకని వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌ ప్రశ్నించింది.


అయితే, వాడిలాల్ కంపెనీ సరఫరా చేస్తున్న వివిధ రకాల పరాటాల్లో వనస్పతి, ఉప్పు, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్, పాలు, ఎడిబుల్ ఆయిల్, చక్కెర, బ్రెడ్ ఇంప్రూవర్, బంగాళదుంప, పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్, క్యారెట్, ధనియాల పొడి, మసాలాలు, యాలకులు, లవంగం, దానిమ్మ గింజలు మొదలైన ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. గోధుమ పిండి, నీరు కాకుండా పరోటాల రకాన్ని బట్టి వీటిని యాడ్‌ చేస్తున్నారని చెప్పింది. కాబట్టి పరాటాల మీద 18 శాతం వస్తు, సేవల పన్ను (GST) ఉండాల్సిందేనని GAAAR కూడా స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.