UPI collect request for P2P transactions banned from Oct 1: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో పీర్-టు-పీర్ (P2P) 'కలెక్ట్ రిక్వెస్ట్' లేదా 'పుల్ ట్రాన్సాక్షన్' ఫీచర్‌ను ఆక్టోబర్ 1, 2025 నుండి శాశ్వతంగా నిలిపివేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.  డిజిటల్ చెల్లింపులలో మోసాలను అరికట్టడం , లావాదేవీల భద్రతను పెంచడం కోసం తీసుకున్నరాు. 

కలెక్ట్ రిక్వెస్ట్ లేదా పుల్ ట్రాన్సాక్షన్ అనేది ఒక వ్యక్తి (రిసీవర్) మరొక వ్యక్తి (సెండర్) నుండి UPI ద్వారా డబ్బు అభ్యర్థించే సౌకర్యం. ఈ ఫీచర్‌ను సాధారణంగా బిల్లులను విభజించడం, స్నేహితుల నుండి అప్పు తిరిగి రాబట్టడం వంటి అవసరాల కోసం ఉపయోగించారు.  రిసీవర్ ఒక కలెక్ట్ రిక్వెస్ట్‌ను పంపితే, సెండర్ తన UPI యాప్‌లో ఈ అభ్యర్థనను ఆమోదించి, UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపు చేస్తాడు.

 ఈ ఫీచర్‌ను సైబర్ నేరస్తులు దుర్వినియోగం చేస్తున్నారు. మోసగాళ్లు తమను చట్టబద్ధమైన వ్యక్తులు లేదా సంస్థలుగా చిత్రీకరించి, నకిలీ కలెక్ట్ రిక్వెస్ట్‌లను పంపి, యూజర్లను మోసం చేసి డబ్బు ఆమోదించేలా చేస్తున్నారు. ఒకసారి యూజర్ UPI పిన్ ఎంటర్ చేస్తే, డబ్బు వెంటనే మోసగాడి ఖాతాకు బదిలీ అవుతుంది. 2019లో, NPCI ఈ ఫీచర్‌ను కొంతవరకు నియంత్రించడానికి P2P కలెక్ట్ రిక్వెస్ట్‌ల గరిష్ఠ పరిమితిని రూ. 2,000కి నిర్ణయించింది. ఈ చర్య మోసాలను తగ్గించినప్పటికీ, సమస్య పూర్తిగా నిర్మూలన కాలేదు. 

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 13,133 డిజిటల్ బ్యాంకింగ్ ,  కార్డ్ మోసాలు నమోదయ్యాయి, దీని వల్ల రూ. 514 కోట్ల నష్టం జరిగింది. 2024లో మొత్తం 29,000 కేసులతో రూ. 1,457 కోట్ల నష్టం సంభవించింది.  అందుకే NPCI పూర్తిగా ఈ ఫీచర్‌ను తొలగించాలని నిర్ణయించింది.  బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (PSPs),   UPI యాప్‌లు (PhonePe, Google Pay, Paytm వంటివి) ఈ రకమైన లావాదేవీలను అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తాయి.