Stock Market update telugu: అమెరికా ఫెడ్‌ కమిటీ సమావేశం సమయం దగ్గరపడటం, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడం మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసింది. ముడి చమురుపై (Crude Oil) మరింత కఠినంగా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ మూమెంటమ్‌ కోల్పోయాయి. దాంతో ఇండియన్‌ మార్కెట్లు (Indian Stock Markets) నష్టాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 709 పాయింట్ల మేర నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,700 దిగువ స్థాయిల్లో ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 56,486 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) నేడు 56,663 వద్ద స్వల్ప లాభాల్లోనే మొదలైంది. ఇదే క్రమంలో కొనుగోళ్లు పెరగడంతో 56,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా విక్రయాలు పెరగడంతో 55,418 వద్ద సూచీ ఇంట్రాడే కనిష్ఠానికి పతనమైంది. గరిష్ఠంతో పోలిస్తే 1300 పాయింట్లు నష్టపోయింది. ఆఖర్లో కాస్త తేరుకొని 709 పాయింట్ల నష్టంతో 55,776 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 16,871 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) మంగళవారం 16,900 వద్ద మొదలైంది. అట్నుంచి 16,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే అమ్మకాల సెగతో 16,555 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది.  370 పాయింట్ల మేర పతనమైంది. చివర్లో కాస్త పుంజుకొని 208 పాయింట్ల నష్టంతో 16,663 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంకు (Nifty Bank) 35,467 వద్ద ఆరంభమైంది. 35,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పతనమై 34,706 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 289 పాయింట్ల నష్టంతో 35,022 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీలో 14 కంపెనీల షేర్లు లాభపడగా 36 నష్టపోయాయి. టాటా కన్జూమర్స్‌, ఎం అండ్‌ ఎం, సిప్లా, శ్రీసెమ్‌, మారుతీ స్వల్పగా లాభపడ్డాయి. టాటా స్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-5 శాతం వరకు నష్టపోయాయి. ఆటోను మినహాయిస్తే మిగతా అన్ని సూచీలు ఎరుపు రంగులోనే ముగిశాయి. ఐటీ, మెటల్‌, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1-4 శాతం మేర పతనమయ్యాయి.