Sensex @ 80,000: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మెుదలైన ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బుల్స్ తమ పవర్ చూపిస్తూ మార్కెట్ సూచీలను కొత్త శిఖరాలకు ర్యాలీ చేయిస్తున్నారు. దీంతో దలాల్ స్ట్రీట్ గతంలో ఎన్నడూ చూడని రికార్డులను కైవసం చేసుకుంటోంది. 


ముందుగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ తొలిసారిగా 80,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. ప్రధానంగా మార్కెట్లలో దూకుడుకు దేశీయ కారణాలతో పాటు గ్లోబల్ మార్కెట్ల నుంచి కొనసాగుతున్న సానుకూల పవనాలు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి. దీంతో ఇంట్రాడేలో బ్యాంకింగ్ నిఫ్టీ సూచీ సైతం సరికొత్త గరిష్టాలను తాకింది.


నేడు భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ తప్ప మిగిలిన అన్ని ఇతర రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ ఇండెక్స్ 2 శాతం పెరిగి సరికొత్త రికార్డును అందుకుంది. ఇదే క్రమంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు సైతం 0.5 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. 


ఉదయం 10.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 494 పాయింట్ల లాభంతో 79935 పాయింట్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ-50 సైతం బుల్ ర్యాలీని కొనసాగిస్తూ 144 పాయింట్లు లాభపడి 24268 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏకంగా 906 పాయింట్ల మెగా వృద్ధితో 53074 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 


మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం బుల్ ర్యాలీ కొత్తగా కేంద్రంలో ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి మోదీ సర్కార్ పై అటు పరిశ్రమ వర్గాలతో పాటు ఇటు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మలా సీతారామన్ తన 6వ బడ్జెట్ సమావేశంలో ఎలాంటి ప్రకటనలు చేస్తారనే ఆసక్తి ప్రస్తుతం మార్కెట్లలో బుల్ ర్యాలీని ప్రేరేపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులకు ఊరట ఉంటుందనే వార్తలు ఎన్నికల తర్వాత ప్రధానంగా వార్తల్లో చక్కర్లు కొట్టడం చూస్తున్నాం.