RBI Latest Update on Rs 2000 Notes: రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెనక్కు తీసుకున్నా, ఇప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బు ప్రజల చేతుల్లోనే ఉంది. కోడి, పిల్లల కోసం గుడ్లను పొదిగినట్లు జనం కూడా ఆ నోట్లపై కూర్చుని పొదుగుతున్నారా? అన్న వేళాకోళాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.


ఆర్‌బీ తాజా లెక్కల ప్రకారం, 2024 జనవరి 31 నాటికి, రూ. 2000 నోట్లలో 97.5 శాతం మాత్రమే బ్యాంక్‌ల దగ్గరకు తిరిగి వచ్చాయి. ఇంకా 2.5 శాతం నోట్లు, అంటే, రూ. 8,897 కోట్ల విలువైన పెద్ద నోట్లు మార్కెట్‌లోనే ఉన్నాయి. పింక్‌ నోట్ల మార్పిడి గడువు ముగిసినా, పెద్ద మొత్తంలో డబ్బు జనం చేతుల్లోనే ఆగిపోయింది.


2026 నవంబర్‌లో డీమోనిటైజేషన్ (Demonetisation) తర్వాత, మళ్లీ 2023 మే నెలలో పెద్ద నోట్లపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. వ్యవస్థ నుంచి రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకోవాలని (Withdrawal of Rs.2000 notes) గత ఏడాది మే 19న నిర్ణయించింది. పింక్‌ నోట్లను బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది.


కరెన్సీ చలామణిలో భారీగా తగ్గుదల
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం, కరెన్సీ అవసరం గణనీయంగా తగ్గింది. 2024 ఫిబ్రవరి 09 నాటికి, కరెన్సీ చలామణి 3.7 శాతం తగ్గింది. ఏడాది క్రితం 8.2 శాతం కంటే ఇది చాలా తక్కువ. చలామణీలో ఉన్న నోట్లు & నాణేలను కూడా కలిపి చెలామణిలో ఉన్న కరెన్సీగా (Currency in Circulation) వ్యవహరిస్తారు. ప్రజల వద్ద ఉన్న నగదు, బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను కూడా కలిపి CICని లెక్కిస్తారు.


కరెన్సీ అవసరాన్ని తగ్గించడంలో రూ.2000 నోట్ల ఉపసంహణ చాలా దోహదపడిందని ఆర్బీఐ వెల్లడించింది. 2024 జనవరిలో బ్యాంకు డిపాజిట్లు బాగా పెరిగాయి. రూ. 2000 నోటు రద్దుకు ఇది లింక్‌ అయిందని తెలుస్తోంది. రిజర్వ్ మనీ కూడా ఏడాది క్రితం నాటి 11.2 శాతం నుంచి 2024 ఫిబ్రవరి 9 నాటికి 5.8 శాతానికి తగ్గింది.


2023 మే 19న, రూ. 2000 నోట్ల ఉపసంహణ నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ తేదీ నాటికి మార్కెట్‌లో దాదాపు రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి 2023 సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత, ఈ గడువును 2023 అక్టోబర్ 07 వరకు పొడిగించింది. 


రూ. 2000 నోట్లను RBI వెనక్కు తీసుకుంది గానీ రద్దు చేయలేదు. అవి ఇప్పటికీ చెల్లుతాయి. 2000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా ‍‌(Rs 2,000 notes are still legal tender) కొనసాగుతాయని ఆర్‌బీఐ కూడా చాలాసార్లు స్పష్టం చేసింది. రెండు వేల నోట్ల చట్టబద్ధతను రిజర్వ్‌ బ్యాంక్‌ రద్దు చేయకపోయినా, వాటిని ఇప్పుడు లావాదేవీల కోసం ఎవరూ వినియోగించడం లేదు. 


పోస్టాఫీస్‌ల ద్వారా రూ.2 వేల నోట్ల జమ (deposit of Rs 2,000 notes through post offices)
రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్‌ చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. దగ్గరలోని పోస్టాఫీస్‌ నుంచి, దేశంలోని 19 RBI ఇష్యూ ఆఫీసుల్లో దేనికైనా 2 వేల రూపాయల నోట్లను పంపవచ్చు. ఆన్‌లైన్‌లో లభించే అప్లికేషన్‌ను పూర్తి చేసి, ఆ దరఖాస్తును & ఖాతాలో జమ చేయాలనుకున్న రూ.2 వేల నోట్లను పోస్టాఫీస్‌లో ఇస్తే చాలు. తపాలా సిబ్బంది వాటిని ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు (RBI Issue Office) పంపుతారు. ఆ డబ్బు మీ బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. పోస్టాఫీస్‌ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి, మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. దీనివల్ల, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది, సమయం మిగులుతుంది. 


పోస్టాఫీస్‌ ద్వారా పంపకూడదనుకుంటే, నేరుగా ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు వెళ్లి రూ.2000 నోట్లను బ్యాంక్‌ ఖాతాలో జమ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఈ శనివారం కూడా స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ - టైమింగ్స్‌ ఇవే