RBI Governor Shaktikanta Das on Paytm: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, కేంద్ర బ్యాంక్‌ ద్రవ్య విధానాన్ని ప్రకటించే సమయంలోనే పేటీఎం గురించి కూడా మాట్లాడారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank) మీద ఇటీవలి కఠిన చర్యల తర్వాత ఫిన్‌టెక్ రంగంలో (FinTech sector) నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు. పేటీఎంపై తీసుకున్న చర్య కారణంగా ఫిన్‌టెక్‌ కంపెనీలు భయపడాల్సిన అవసరం లేదని, ఆ యాక్షన్‌ కేవలం ఒక సంస్థకు సంబంధించినదని, మొత్తం ఇండస్ట్రీకి వర్తించదని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వివరించారు. పరిపాలన సరి చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ తగినంత సమయం ఇస్తున్నట్లు కూడా చెప్పారు.


పేటీఎం సంక్షోభంపై FAQs 
పేటీఎం సంక్షోభానికి సంబంధించి తరచూ అడుగుతున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని, సెంట్రల్ బ్యాంక్ త్వరలో FAQs (Frequently Asked Question On Paytm) జారీ చేస్తుందని గవర్నర్ దాస్ ప్రకటించారు. ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా నిబంధనలు పాటించడానికి అన్ని నియంత్రిత సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ తగిన సమయం ఇస్తుందని చెప్పారు. పేటీఎం కూడా ఆర్‌బీఐ నియంత్రిత కంపెనీల లిస్ట్‌లో ఉంది, నిబంధనలకు కట్టుబడి ఉండడానికి ఆ కంపెనీకి కూడా సరిపడా టైమ్‌ ఇచ్చింది.


తప్పులు సరి చేసుకోవడానికి తగిన సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేనప్పుడు సెంట్రల్ బ్యాంక్ ద్వారా చర్యలు తీసుకుంటామని దాస్‌ స్పష్టం చేశారు. రూల్స్‌ పాటించడంలో ఏ స్థాయిలో విఫలమైతే, రిజర్వ్ బ్యాంక్ తీసుకునే చర్య కూడా అదే స్థాయిలో ఉంటుందని కుండబద్ధలు కొట్టారు. 'నిబంధనలకు అనుగుణంగా పని చేసే సంస్థపై ఎందుకు చర్య తీసుకోవాలి?, బాధ్యతాయుతమైన నియంత్రణ మనకు అవసరం. వ్యవస్థపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని దాస్‌ చెప్పారు. 


ఏదైనా ప్రత్యేక కేసు లేదా సంస్థ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ అన్నారు. ఆర్థిక రంగానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇస్తున్న మద్దతు గురించి వివరించారు.


పేటీఎం గురించి ప్రస్తావించిన సందర్భంలో ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడిన కీలక మాటలు:


- ఆర్థిక రంగంలో నూతన ఆవిష్కరణలకు రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇస్తోంది, అది కొనసాగుతుంది.
- ఫిన్‌టెక్, ఇన్నోవేషన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో రిజర్వ్ బ్యాంక్ నిబద్ధతపై ఎటువంటి సందేహం అక్కర్లేదు.
- మేం కొంత కాలంగా సంబంధిత సంస్థతో (పేటీఎం) సంప్రదింపులు జరుపుతున్నాం.
- పేటీఎం వివాదంలో నియంత్రణ వివరాలను పంచుకోవడం సరికాదు.
- దీర్ఘకాలిక విజయం కోసం ప్రతి సంస్థ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
- ఆర్‌బీఐ తీసుకున్న చర్యలన్నీ వ్యవస్థలో స్థిరత్వం & వినియోగదార్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే.
- పేటీఎం సమస్యపై ఆర్‌బీఐ త్వరలో FAQs జారీ చేస్తుంది.


ఆరోసారి కూడా మారని రెపో రేట్‌
ఆర్‌బీఐ రెపో రేట్‌ (RBI Repo Rate) వరుసగా ఆరోసారి కూడా మారలేదు, 6.50 శాతం వద్దే ఉంది. 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50 శాతానికి చేర్చిన కేంద్ర బ్యాంక్‌, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ను కొనసాగిస్తూ వస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల భద్రతను పెంచడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు దాస్‌ చెప్పారు. రిటైల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ ఆఫ్‌లైన్‌లోనూ పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) రేటు 5.4 శాతంగా నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతానికి తగ్గుతుందని లెక్కగట్టింది. 


మరో ఆసక్తికర కథనం: రేషన్‌ షాపుల్లోనూ ఆన్‌లైన్‌ విక్రయాలు, ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ పెట్టొచ్చు!