RBI MPC Meet April 2024 Decisions: భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వాళ్లకు వరుసగా ఏడోసారీ నిరాశ తప్పలేదు. ఆర్‌బీఐ రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది.


ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసిన తర్వాత లైవ్‌లోకి వచ్చిన RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), కీలక రేట్లపై MPC తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.


రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం వరుసగా ఇది ఏడో సారి. ఈ ఏడాది జూన్‌లో RBI MPC తదుపరి మీటింగ్‌ ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది.


2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ కంటిన్యూ చేస్తోంది. అంటే 16 నెలలుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.


అధిక వడ్డీ రేట్లు మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తాయి, చివరికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సాయం చేస్తాయి. ఇలాంటి ప్రయోజనం ఉన్నప్పటికీ, ఖరీదైన రుణాలు దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, అధిక RoI ‍‌(Rate of Interest) కారణంగా మార్కెట్ తక్కువ రుణాలను తీసుకుంటుంది, తక్కువ పెట్టుబడులు పెడుతుంది. 


ప్రపంచ కేంద్ర బ్యాంకుల్లో, ముఖ్యంగా US FED వైఖరిని పరిశీలిస్తే, వడ్డీ రేట్లలో కోతలపై అది హింట్‌ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి తగ్గింపు ఉండదని కూడా చెప్పింది. యుఎస్ ఫెడ్ ఈ ఏడాదిలో మూడుసార్లు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే.. వడ్డీ రేట్లను తగ్గించే ముందు, అమెరికాలో ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలోకి రావాలని ఫెడరల్ రిజర్వ్ కోరుకుంటోంది.