Dmart Vs Zepto: దేశంలో రిటైల్ వ్యాపారంలో డీమార్ట్ స్టోర్ల రాక పెను మార్పులకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దీనికి ముందు ఫ్యూచర్ గ్రూప్ దేశంలోని మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్ గా ఉండేది. అయితే కరోనా సమయంలో ఏర్పడిన ఫైనాన్షియల్ క్రంచ్, వ్యాపారాన్ని రిలయన్స్ కంపెనీకి విక్రయించటాన్ని అమెజాన్ అడ్డుకోటంతో చివరి దివాలా ప్రక్రియకు కంపెనీ వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


అయితే రాధాకిషన్ దమానీకి చెందిన అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కంపెనీ వాస్తవానికి దేశంలోని డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. దమానీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రముఖ ఇన్వెస్టర్ పైగా దివంగత బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకి గురువని మనలో చాలా మందికి తెలియదు. డీమార్ట్ అర్థం "Discount Mart". దమానీ చిన్న వ్యాపారం నుంచి ప్రారంభించి క్రమంగా దానిని విస్తరించారు. తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడం ఆయన వ్యూహం. ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటిగా ఎదిగి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300కి పైగా స్టోర్లను స్థాపించింది. 


డీమార్ట్ భారతదేశ రిటైల్ రంగంలో ఒక ముఖ్యమైన ఆటగాడిగా మారింది. అనేక సంవత్సరాలుగా వ్యాపారాన్ని క్రమపద్ధితిలోకి తెచ్చిన దమానీ ప్రస్తుతం వేగంగా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో డీమార్ట్ వ్యాపారాన్ని అధిగమించగలమని తాము వేగంగా ముందుకు సాగుతున్నట్లు క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో సీఈవో ఆదిత్ పలిచా పేర్కొన్నారు. రాబోయే 18-24 నెలల్లో కంపెనీ విక్రయాలు డీమార్ట్ అమ్మకాలను అధిగమిస్తాయన్నారు. రానున్న 5-10 ఏళ్లలో 2.5 ట్రిలియన్ రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం దేశంలోని 40 నగరాల్లో 50-75 మిలియన్ల మందిని టార్గెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


2029 ఆర్థిక సంవత్సరం నాటికి భారత రిటైల్ మార్కెట్ వ్యాపారం ఏకంగా 850 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అయితే ఇందులో 400 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని గృహ వినియోగదారుల నుంచి పొందాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో వ్యాపారాన్ని వేగంగా విస్తరించేందుకు వీలుగా ఇటీవలి కాలంలో కంపెనీ సిరీస్ ఎఫ్ రౌండ్ ఫండింగ్ ద్వారా 665 మిలియన్ డాలర్లను 3.6 బిలియన్ డాలర్ల విలువతో సమీకరించింది. ఈ సొమ్ముతో ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో 350గా డార్క్ స్టోర్ల సంఖ్యను డబుల్ చేసి 700లకు చేర్చాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కంపెనీ రానున్న 12-15 నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 


జెప్టో ఇప్పటికే క్విక్ కామర్స్ వ్యాపారంలో స్విగ్గీ ఇన్టామార్ట్, జొమాటో బ్లింకిట్, టాటా బిగ్ బాస్కెట్, కంట్రీడిలైట్ వంటి పెద్ద ఆటగాళ్లతో పోటీ పడుతోంది. అయితే రిలయన్స్ కంపెనీకి చెందిన జియో మార్ట్ సైతం రానున్న కాలంలో ఈ వ్యాపార విభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వస్తువులను 10-15 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపారంలో జెప్టో వేగంగా మార్కెట్ షేర్ పొందాలని చూస్తోంది. వాస్తవానికి ఈ కంపెనీ 2021లో ప్రారంభించబడింది.