PM Kisan eKYC deadline: రైతన్నలకు గుడ్‌న్యూస్‌! ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన ఈకైవైసీ (PMKSJ eKYC) తుది గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. ఇంతకు ముందు 2022 మే 31 చివరి తేదీగా ఉండేది. ఇప్పుడు దానిని 2022, జులై 31 వరకు పొడగించారు. 'పీఎం కిసాన్‌ లబ్ధిదారుల ఈకేవైసీ తుది గడువును 2022 జులై 31కి పొడగించారు' అంటూ పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించారు.


పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన (PM Kisan Samman Yojana) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6000 వరకు నగదు జమ చేస్తుంటుంది. వీటిని మూడు దఫాలుగా ఇస్తారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2000 పెట్టుబడి సాయంగా  ఇస్తుంటారు. 2022, మే31న సిమ్లాలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 11వ విడత నగదు విడుదల చేశారు. ఫలితంగా 10 కోట్ల మందికి పైగా రైతులకు మేలు జరిగింది.


పీఎం కిసాన్‌ యోజన ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ


* మొదట https://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌పేజీకి లాగిన్‌ అవ్వాలి.
* హోమ్‌  పేజీలో కుడివైపు  ఈ-కేవైసీ (eKYC) ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
* ఆధార్‌ కార్డు నంబర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.
* ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.
* గెట్‌ ఓటీపీపై క్లిక్‌ చేస్తే ఓటీపీ సంఖ్య వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి.


మీరు సమర్పించిన వివరాలన్నీ సరిపోతే ఈ-కేవైసీ పూర్తైనట్టే. లేదంటే చెల్లనిదిగా మార్క్‌ చేస్తారు. అలాంటప్పుడు మీరు స్థానిక ఆధార్‌ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఇంతకు ముందే ఈ పథకంలో అవినీతి జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్‌ కార్డును అనుసంధానం చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ పథకంలో చేరని వారు ఎలా చేరాలో వివరించింది.


అనర్హులు జొరపడకుండా..!


ఈ పథకంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్‌ కార్డును తప్పని సరి చేసింది. అయితే అర్హతలు ఉండీ రేషన్‌ కార్డు లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న రైతులు, ఇకపై చేసుకోవాలని అనుకుంటున్న రైతులూ తప్పకుండా రేషన్‌ కార్డును చూపించాల్సిందే. కార్డు లేనివారు త్వరగా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌లో రేషన్‌ కార్డు సంఖ్య సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.


ఏయే పత్రాలు కావాలంటే..


లబ్ధిదారులకు రెండు హెక్టార్లకు మించి భూమి ఉండొద్దు.
భూమి యాజమాన్యం పత్రాలు
ఆధార్‌ కార్డు
గుర్తింపు కార్డు
డ్రైవింగ్‌ లేదా ఓటర్‌ ఐడీ
బ్యాంక్‌ ఖాతా పుస్తకం
మొబైల్‌ ఫోన్‌ నంబర్‌
చిరునామా
భూమి పరిమాణం సహా వివరాలు
ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో


రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..


ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి.
'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి.
తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.
దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.  తర్వాత ముందుకు వెళ్లాలి.
ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి
బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.
ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.
ఇలా చెక్ చేసుకోవాలి


పీఎం కిసాన్ లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘'డేటాను పొందండి'’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే ‘'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు.