Mahila Samman Saving Certificate:


మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకం తీసుకొస్తోంది. మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌ను (MSSC) ఆవిష్కరిస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇది ఆరంభమవుతోంది. తక్కువ కాల వ్యవధి డబ్బు డిపాజిట్‌ చేస్తే ఎక్కువ వడ్డీ అందించడం దీని ప్రత్యేకత! మరి ఇందులో చేరేందుకు అర్హతలు ఏంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వడ్డీ ఎంతొస్తుంది? పన్ను ప్రయోజనాల వివరాలు మీకోసం!


కొత్త పథకం!


కొన్ని రోజుల క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. స్త్రీల కోసం మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (Mahila Samman Savings Certificate) పథకం తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఇందులో మహిళలు లేదా బాలికల పేరుతో రూ.2 లక్షల వరకు గరిష్ఠంగా డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. గరిష్ఠ కాల పరిమితి రెండేళ్లని, 7.5 శాతం వడ్డీ ఇస్తామని వివరించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం కావడంతో ఎలాంటి నష్టభయం ఉండదు. నిశ్చితంగా డబ్బు జమ చేయొచ్చు.


కేవలం రెండేళ్లే


కేవలం మహిళలు లేదా బాలికల పేరుతోనే డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు, పోస్టాఫీస్‌ ఫిక్సడ్‌ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీయే ఇందులో పొందొచ్చు. ఒక్కో ఖాతాలో గరిష్ఠంగా రూ.2 లక్షలే జమచేయాలి. కనీస మొత్తం చెప్పలేదు. ఇది వన్‌టైమ్‌ స్కీమ్‌. అంటే 2023-2025 మధ్యే రెండేళ్లు ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. అవసరమైతే పాక్షిక మొత్తం ఖాతాలోంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సెక్షన్‌ 80సీ కింద మినహాయింపులు ఉంటాయి. మహిళా సమ్మాన్‌ పథకాన్ని పన్ను మినహాయింపులు ఉంటాయో లేదో ఇంకా చెప్పలేదు.


దరఖాస్తు విధానం


ఈ పథకం 2023, ఏప్రిల్‌ 1 నుంచి మొదలవుతుంది. జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసులో మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ ఖాతాలను తెరవొచ్చు. దరఖాస్తు పత్రాల్లో వ్యక్తిగత, నామినీ, ఆర్థిక వివరాలు ఇవ్వాలి. సంబంధిత గుర్తింపు పత్రాలను సమర్పించాలి. మీకు నచ్చిన మొత్తాన్ని నగదు లేదా చెక్‌ రూపంలో జమ చేయాలి. ఆపై మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పెట్టుబడి పత్రాలను పొందాలి. గడువు తీరాక బ్యాంకు వెళ్తే వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేస్తారు.


రాబడి ఇలా


రెండేళ్ల కాలపరిమితి, 7.5 శాతం వడ్డీ ఇస్తుండటంతో ఈ పథకం చాలామందిని ఆకర్షిస్తోంది. ఇందులో గరిష్ఠ పెట్టుబడి రూ.2 లక్షలను పెడితే ఎంతొస్తుందో చూద్దాం! మొదటి సంవత్సరం 7.5 శాతం చొప్పున రూ.15,000 వడ్డీ జమ అవుతుంది. రెండో ఏడాది అసలు, తొలి ఏడాది వడ్డీ రెండింటికీ కలిపి రూ.16,125 వడ్డీ చెల్లిస్తారు. అంటే రెండేళ్ల తర్వాత మీ అసలు రూ.2లక్షలు, వడ్డీ రూ.31,125 మొత్తంగా రూ.2,31,125 అందుకుంటారు. పీపీఎప్‌, ఎన్‌పీఎస్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్లతో పోలిస్తే ఇదెంతో బెటర్‌!