EPFO KYC Updation Process In Telugu: 'ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌'కు ‌(EPFO) దేశవ్యాప్తంగా కోట్లాది ఖాతాలు ఉన్నాయి. మీరు కూడా EPFO సబ్‌స్క్రైబర్‌ అయితే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. EPFO, తన చందాదార్లకు e-KYCని తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్ మోసాల నుంచి ఖాతాదార్లను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు, e-KYC వల్ల EPFOకు సంబంధించిన క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్ కేసులు కూడా వేగవంతం అవుతాయి.


ఇంట్లో కూర్చొని e-KYC పూర్తి చేయొచ్చు
కోట్లాది మంది ఖాతాదార్లు ఇంట్లోనే కూర్చుని e-KYCని పూర్తి చేసే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందిస్తోంది. ఈ పని చాలా సులభం. కొన్ని ఈజీ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు, KYC ప్రక్రియను పూర్తి చేయొచ్చు. 


e-KYC పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలు (Documents required to complete EPFO e-KYC)
ఆధార్ కార్డు (Aadhaar card)
పాన్ కార్డ్ (PAN card)
బ్యాంక్ ఖాతా వివరాలు (Bank account details)


ఇవి కాకుండా, పాస్‌పోర్టు నంబర్‌ (Passport Number), డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving license), ఓటరు గుర్తింపు కార్డు (Voter Identity Card), రేషన్ కార్డు ‍‌(Ration card) వంటి వివరాలు ఉంటే, వాటిని కూడా సమర్పించవచ్చు.


ఈపీఎఫ్‌ ఖాతాలో KYCని ఇలా అప్‌డేట్ చేయండి ‍‌(Update EPFO e-KYC Online‌)


KYC అప్‌డేట్ చేయడానికి, ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
హోమ్‌ పేజీలో సర్వీస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'ఫర్ ఎంప్లాయీస్' సెక్షన్‌పై క్లిక్ చేయండి.
తర్వాత మీ UAN మెంబర్ పోర్టల్‌పై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీరు UAN, పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి.
లాగిన్‌ అయిన తర్వాత, హోమ్ పేజీలో మేనేజ్‌ ఆప్షన్‌ ఎంచుకోండి.
తర్వాత మీ ముందు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి, అందులోనుంచి KYC ఆప్షన్‌ ఎంచుకోండి.
ఆ తర్వాత మరో పేజీ ఓపెన్‌ అవుతుంది, అందులో కొన్ని డాక్యుమెంట్లు కనిపిస్తాయి.
పాన్, ఆధార్ సమాచారాన్ని నమోదు చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
వివరాలను నింపిన తర్వాత, మరోమారు అన్ని వివరాలను తనిఖీ చేయండి.
ఆ తర్వాత అప్లై బటన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడితో మీరు చేయాల్సిన పని పూర్తవుతుంది.
మీరు KYC అప్‌డేట్‌ చేసిన సమాచారం మీ కంపెనీ యజమాన్యానికి వెళ్తుంది.
యాజమాన్యం నుంచి ఆమోదం పొందిన తర్వాత EPF ఖాతాలో KYC అప్‌డేషన్‌ పూర్తవుతుంది.


EPFO నియమాల్లో మార్పులు
EPFO నిబంధనల్లో ఈ నెల ప్రారంభం (01 ఏప్రిల్‌ 2024‌) నుంచి అతి పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు, ఒక వ్యక్తి ఉద్యోగం మారితే, అతని EPF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు ఖాతాదారు అభ్యర్థనపై మాత్రమే ఖాతా బదిలీ జరుగుతోంది.


2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ రేటును 8.25% గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఇది మూడేళ్లలో గరిష్ట రేటు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రేటు 8.15%. EPF వడ్డీ రేటు ఏటా మారుతుంది. 


మరో ఆసక్తికర కథనం: ఇకపై కాల్ ఫార్వార్డింగ్ కుదరదు, మీరు మళ్లీ రిక్వెస్ట్‌ చేస్తేనే!