How To Avoid UPI Fraud:చాయ్‌బండి దగ్గర పది రూపాయల నుంచి షాపింగ్‌ మాల్‌లో పది వేల వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా యూపీఐ(unified Payments Interface) పేమెంట్స్‌దే హవా. జేబులో పర్సు లేకపోయినా స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు, ప్రపంచాన్ని చుట్టేయవచ్చు అనే ధీమాతో నేటి జెన్‌జీ ఆల్ఫా జనరేషన్ బతుకుతోంది. డిజిటల్‌ చెల్లింపులు మన జీవితాలను చాలా సులభతరం చేశాయి. వేగం, సౌకర్యాన్ని అందించాయి. కానీ, ఈ డిజిటల్‌ కన్వీనియన్స్‌ వెనుక ఊహించని సైబర్ ముప్పు పొంచి ఉంది. క్షణాల్లో పనులు అయిపోతాయనే ఆనందం ఒకవైపు  ఉంటే రెప్పపాటులో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ అవుతున్నాయన్న భయం మరోవైపు అందరినీ వెంటాడుతోంది. సైబర్ నేరగాళ్లు సరికొత్త టెక్నిక్‌తో సామాన్యులను చదువుకున్న వారిని కూడా ఏమార్చుతున్నారు. ఫిషింగ్‌ లింక్స్, నకిలీ QR కోడ్స్‌, సోషల్ ఇంజనీరింగ్‌ ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్లు దోచేస్తున్నారు. 2026 నాటికి సైబర్ స్కామ్‌లు మరింత పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ యూజర్లలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ యూపీఐ స్కామ్స్‌ ఎలా జరుగుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా సూచిస్తున్న గైడ్‌లైన్స్‌ ఏంటో చూద్దాం.  

Continues below advertisement

అసలు ఈ UPI స్కామ్‌ ఎలా జరుగుతాయి?

డిజిటల్ పేమెంట్స్‌ ప్రపంచంలో స్కామర్స్‌ వాడే ట్రిక్స్‌ చాలా సింపుల్‌గా అనిపించినా అవి మన కొంప ముంచుతాయి. మీ ఖాతాలోకి అనుకోకుండా కొంత డబ్బు వచ్చినట్టు మెసేజ్‌ వస్తుంది. వెంటనే ఒక గుర్తుతెలియని నంబ్‌ నుంచి కాల్ వచ్చి పొరపాటున మీకు డబ్బులు పంపాను. దయచేసి తిరిగి పంపండి అని రిక్వెస్ట్‌ పెడతారు. మీరు ఆ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్‌ చేయగానే వాస్తవానికి మీ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతాయి. 

వాట్సాప్‌ లేదా మెసేజ్‌ ద్వారా ఒక క్యూఆర్‌ కోడ్‌  పంపి, దీన్ని స్కాన్ చేస్తే మీకు లాటరీ డబ్బులు వస్తాయని నమ్మి్తారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ చేసి పిన్ కొట్టగానే ఖాతా ఖాళీ అవుతుంది. క్యూఆర్‌ కోడ్‌ అనేది ఎల్లప్పుడూ డబ్బు పంపడానికి వాడతారని గుర్తుంచుకోండి. 

Continues below advertisement

బ్యాంక్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయిందనో, కేవైసీ అప్‌డేట్‌ చేయాలనో మీ మొబైల్‌కు ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తాయి. అందులో ఉన్న నకిలీ వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేసి మీ వివరాలు ఇస్తే, మీ సెన్సిటివ్‌ డేటా, లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్తుంది. 

సిమ్ స్వాపింగ్ అండ్‌ స్క్రీన్ షేరింగ్ 

స్కామర్లు బ్యాంక్ అధికారుల్లా నటిస్తూ కాల్ చేస్తారు. ఏదైనా టెక్నికల్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఎనీ డెస్క్‌ లేదా టీమ్‌ వ్యూస్‌ లాంటి రిమోట్‌ యాక్సెస్‌ యాప్స్‌ డౌన్‌లోడ్ చేయమంటారు. ఇవి డౌన్‌లోడ్ చేయగానే, మీ మొబైల్ కంట్రోల్‌ మొత్తం వాళ్ల చేతిలోకి వెళ్లిపోతంది. మీకు వచ్చే ఓటీపీ వాళ్లే చదువుకుని డబ్బులు కొట్టేస్తారు. నేరగాళ్లు మీ మొబైల్ నంబర్‌కు డూప్లికేట్‌ సిమ్‌ కార్డ్‌ పొందుతారు. ఒకసారి వాళ్లకు మీ నంబ్‌ యాక్సెస్‌ దొరికిందంటే మీ ఒరిజినల్‌ ఫోన్ సిగ్నల్‌ ఆగిపోయి మీ ఓటీపీలు వాళ్లకే వెళ్తాయి. తద్వారా మీ బ్యాంకింగ్‌ అకౌంట్స్‌ కంట్రోల్‌ తీసుకుంటారు. 

కస్టమర్‌ కేర్, ప్రభుత్వ అధికారుల పేరుతో బెదిరింపులు 

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్ నెంబర్‌ల కోసం వెతికేటప్పుడు మోసగాళ్లు నకిలీ నెంబర్లను ఎస్‌ఈవో ద్వారా పైకి వచ్చేలా చేస్తారు. వాటికి కాల్ చేస్తే వాళ్లే బ్యాంక్ సిబ్బంది అని నమ్మిస్తారు. ఇది మాత్రమే కాకుండా, ఏకంగా పోలీస్‌, కస్టమ్స్‌ లేదా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి మీ పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని భయపెడతారు. కేసును వెంటనే ఇక్కడే సెటిల్ చేసుకోవాలంటే వాట్సాప్‌ లేదా స్కైప్‌ ద్వారా డబ్బులు పంపాలని ఒత్తిడి తెస్తారు. నిజమైన దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ  ఆన్‌లైన్‌లో సెటిల్మెంట్‌లు చేయవు. 

ఈ ఐదు రూల్స్ పాటిస్తే డబ్బులు సేఫ్‌ 

UPI లావాదేవీలను పర్యవేక్షించే ఎన్‌పీసీఐ సైబర్‌ మోసాలను అరికట్టడానికి తన సేఫ్టీ షీల్డ్‌ ద్వారా కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తోంది.

  • రూల్‌-1- మీ బ్యాంక్‌ ఖాతా నుంచి ఇతరులకు డబ్బులు పంపడానికి మాత్రమే UPI-PIN వాడాలి. మీ ఖాతాలోకి డబ్బులు రావడానికి ఎవరికీ మీ పిన్ చెప్పాల్సిన పని లేదు. యాప్‌లో ఎంటర్‌ చేయాల్సిన అవసరం అసలు లేదు. 
  • రూల్‌ -2 ఎవరికైనా పేమెంట్‌ చేసే ముందు వాళ్ల UPI ID ఎంటర్‌ చేశాక యాప్‌లో కనిపించే అసలైన పేరును ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాతే ప్రాసెస్‌ చేయండి. 
  • రూల్‌ -3 గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారన్న ఒకే ఒక్క కారణంతో ఎలాంటి స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ఫార్వార్డింగ్‌ యాప్స్‌ మీ ఫోన్‌లో ఇన్స్టాల్‌ చేయకండి. 
  • రూల్‌ 4- థర్డ్ పార్టీ సైట్ల నుంచి ఏపీకే ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేయకుండా ఎల్లప్పుడూ గూగుల్‌ ప్లే స్టోర్ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ లాంటి ప్లాట్‌ఫామ‌ల నుంచి మాత్రమే బ్యాంకింగ్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
  • రూల్‌ 5- కేవలం 12345 లాంటి సింపుల్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోకుండా, ఎవరికీ ఊహించడానికి వీలుకాని విధంగా పిన్ సెట్‌ చేసుకోవాలి. బయోమెట్రిక్‌ సెక్యూరిటీ ఎనేబుల్‌ చేసుకోవాలి. 

ఒకవేళ మోసపోతే వెంటనే ఏం చేయాలి?

ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పొరపాటున స్కామర్ల వలలో పడిపోతుంటాం. అప్పుడు భయంతో సైలెంట్‌ అవ్వకూడదు. మీ రియాక్షన్ టైమ్‌ ఎంత తక్కువ ఉంటే, మీ డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. మొదటి గంట చాలా కీలకం. ఇండియాలో సైబర్‌ నేరాలపై 24/7 ఫిర్యాదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ టోల్‌ ఫ్రీ హెల్ప్‌ైన్ నెంబర్‌ 1930కి వెంటనే కాల్ చేయండి. ఆ తర్వాత అధికారి వెబ్‌సైట్‌ cybercrime.gov.inలోకి వెళ్లి మీ కంప్లైంట్‌ను, ఆధారాలను సమర్పించండి. మీ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసిన మీ కార్డ్స్‌, బ్యాంకు అకౌంట్‌, యూపీఐడీను వెంటనే బ్లాక్ చేయండి. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం అనధికారిక ట్రాన్సాక్షన్ జరిగిన మూడు రోజుల లోపు బ్యాంక్‌కు ఫిర్యాదు చేస్తే కస్టమర్‌ నిర్లక్ష్యం లేని పక్షంలో పోయిన డబ్బును పూర్తిగా రీఫండ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 

నిజమైన బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, పోలీసులు లేదా ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పటికీ మీ ఓటీపీ, సీవీవీ, పిన్, లేదా పాస్ వర్డ్‌లను కాల్స్ మెసేజ్‌లు లేదా వీడియో కాల్స్‌లో అడగవు.