SBI Sarvottam Scheme: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India), అనేక రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను (SBI Fixed Deposit Scheme) ఆఫర్‌ చేస్తోంది. కొన్ని ఫిక్స్‌డ్‌ జిపాజిట్‌ పథకాలను ప్రత్యేకంగా ప్రవేశపెడుతోంది. ఈ ప్రత్యేక డిపాజిట్ల కాల గడువు (మెచ్యూరిటీ టైమ్‌), వీటిపై బ్యాంక్‌ చెల్లించే వడ్డీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి పథకాల్లో సర్వోత్తమ్‌ పథకం ఒకటి.
 
నాన్‌-కాలబుల్‌ డిపాజిట్‌ స్కీమ్‌
‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఆఫర్‌ చేస్తున్న సర్వోత్తమ్‌ కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం నాన్‌-కాలబుల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ (Non-Callable Fixed Deposit Scheme). అంటే కాల పరిమితి లేదా మెచ్యూరిటీ గడువు ముగియడానికి ముందే ఈ ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఒకవేళ తప్పనిసరై గడువుకు ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, అందుకు కొంత మొత్తం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు, మొదట చెప్పిన వడ్డీ రేటును కూడా బ్యాంక్‌ తగ్గిస్తుంది.


ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో ఎంత డిపాజిట్‌ చేయవచ్చు?          
ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో కనిష్ఠంగా 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా 5 కోట్ల రూపాయల వరకు డిపాజిట్‌ చేసేందుకు వీలుంది. 


ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో ఎంత వడ్డీ వస్తుంది?     
7.1 శాతం నుంచి 7.9 శాతం వరకు వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NPS), ఇతర పోస్టాఫీస్‌ పొదుపు పథకాలతో (Post Office Saving Schemes) పోలిస్తే సర్వోత్తమ్‌ స్కీమ్‌లో వడ్డీ రేటు అధికంగా ఉంది. 


స్టేట్‌ బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ FD స్కీమ్‌ ఏడాది, రెండేళ్ల కాల గడువుతో డబ్బులు డిపాజిట్‌ చేయొచ్చు. ఏడాది కాలం కోసం డబ్బు డిపాజిట్‌ చేసిన సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వాళ్లు) బ్యాంక్‌
7.1 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్లు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) డిపాజిట్‌ చేస్తే, మరో 0.5 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే, ఏడాది కాల వ్యవధి సర్వోత్తమ్‌ స్కీమ్‌ డిపాజిట్‌కు, సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ వస్తుంది.    


అదే రెండేళ్లు కాల పరిమితి స్కీమ్‌ కింద డబ్బులు డిపాజిట్‌ చేస్తే... సాధారణ పౌరులకు చెల్లించే వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంటుంది. ఇదే కాల వ్యవధి డిపాజిట్లకు సీనియర్ సిటిజన్స్‌కు 7.9 శాతం వడ్డీని బ్యాంక్‌ అందిస్తుంది. 


2023 ఫిబ్రవరి 17 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని స్టేట్‌ బ్యాంక్ వెల్లడించింది.


ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో కాల గడువు ముగిసిన తర్వాత ఆ డిపాజిట్లను రెన్యువల్‌ చేయించుకోవడానికి వీలుండదు. సంబంధిత కాల పరిమితి ముగియగానే వడ్డీతో కలిపి ఆ మొత్తం పెట్టుబడిదారు ఖాతాలో జమవుతుంది. మీకు ఆ స్కీమ్‌ మళ్లీ కావాలంటే, ఫ్రెష్‌గా డిపాజిట్‌ చేయాలి.