Deposit Insurance Coverage Limit Will Be Extended: ముంబైలోని 'న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌'లో దాదాపు 122 కోట్ల రూపాయల మోసం జరిగింది. వాస్తవానికి ఆ డబ్బు బ్యాంక్‌లో లేదు, బ్యాంక్‌ ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ హితేశ్‌ మెహతా ఆ డబ్బును స్థానిక బిల్డర్‌కు అక్రమంగా అందించినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయం తెలియడంతో న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌ కస్టమర్లు తీవ్రంగా ఆందోళన చెందారు. తమ డిపాజిట్లను వెనక్కు తీసుకోవడానికి ఆ బ్యాంక్‌ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, ఖాతాదార్ల డిపాజిట్లను కాపాడటానికి భారత ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉంది, డిపాజిట్ బీమా కవరేజీని పెంచబోతోంది. కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి పెంచేందుకు చర్చలు జరుపుతోంది, ఎంత పెంచుతారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ చర్య ఉద్దేశ్యం ప్రజల పొదుపులను రక్షించడం.


డిపాజిట్ బీమా కవరేజీ అంటే ఏంటి?
జీవిత బీమా, ఆరోగ్య బీమా ఉన్నట్లే, బ్యాంక్‌లో డిపాజిట్లకు కూడా బీమా కవరేజ్‌ ఉంటుంది. ప్రతి బ్యాంక్‌, తమ బ్యాంక్‌లోని డిపాజిట్లకు ఇన్సూరెన్స్‌ చేస్తాయి. బ్యాంక్‌ దివాళా తీసినప్పుడు, ఇన్సూరెన్స్‌ ఉంటుంది కాబట్టి డిపాజిట్‌దార్లకు డబ్బు తిరిగి వస్తుంది. ఈ బీమాను, రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ అయిన 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్' (DICGC) నిర్వహిస్తుంది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన కుంభకోణం తర్వాత, ఆ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం & ఉపసంహరించడంపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. అదే సమయంలో, 'కార్పొరేషన్ డిపాజిట్ బీమా' కింద ఖాతాదార్లకు గరిష్టంగా రూ.5 లక్షలు (డిపాజిట్‌+వడ్డీ కలిపి) లభిస్తాయి. న్యూ ఇండియా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డిపాజిటర్లలో దాదాపు 90 శాతం మందికి బీమా కవరేజ్‌ కింద వాళ్ల డిపాజిట్‌ చేసి పూర్తి మొత్తం తిరిగి లభిస్తుంది.


రూ.5 లక్షల నుంచి పెంచే ఆలోచన
ఇప్పుడు, బ్యాంక్‌ డిపాజిట్లపై బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి పెంచే విషయాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం.నాగరాజు వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాగరాజు మాట్లాడారు. డిపాజిట్‌ బీమా పరిమితిని పెంచడం ముఖ్యమైన విషయం అని, దానిని చురుగ్గా పరిశీలిస్తున్నాట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే, తాము నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం వరకు, అంటే, 2020 వరకు, డిపాజిట్ బీమా కవరేజీ రూ.లక్షగా ఉండేది. 


డిపాజిట్ బీమా డబ్బు ఎప్పుడు లభిస్తుంది?
ఒక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కుప్పకూలినప్పుడు/దివాలా తీసినప్పుడు, డిపాజిటర్లకు బీమా డిపాజిట్ క్లెయిమ్‌లు చెల్లింపులు ప్రారంభమవుతాయి. DICGC గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి క్లెయిమ్‌లు చెల్లిస్తోంది. ఈ కార్పొరేషన్, తాను అందించే కవరేజ్‌ కోసం బ్యాంకుల నుంచి ప్రీమియం వసూలు చేస్తుంది. బ్యాంక్‌ దివాలా తీస్తే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, రూ.5 లక్షల వరకు (డిపాజిట్‌+వడ్డీ కలిపి) కస్టమర్‌లకు చెల్లిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: వెంటనే రూ.40 లక్షలు కావాలా?, ఎక్స్‌ప్రెస్ లోన్ స్కీమ్‌ తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌