Morgan Stanley Buys Paytm Shares: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ (PPBL) మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించి ఆంక్షల కారణంగా, గత రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో పేటీఎం షేర్లు పాతాళానికి జారిపోయాయి. వరుసగా ఆ రెండు రోజులు 20% చొప్పున పతనమై, లోయర్‌ సర్క్యూట్స్‌లో లాక్‌ అయ్యాయి. 


పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద ఆర్‌బీఐ విధించి ఆంక్షలు పేటీఎం వ్యాపారం మీద పెద్దగా ప్రభావం చూపవని కంపెనీ మేనేజ్‌మెంట్‌ చెబుతున్నా, ఆ మాటల్ని మార్కెట్‌ నమ్ముతుందన్న సంకేతాలు పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి, పేటీఎం షేర్లలో నష్టం ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి. 


పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌కు (One97 Communications Limited) పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో 49% వాటా ఉంది.


పేటీఎంకు పెద్ద ఊరట
ఈ కష్టకాలంలో పేటీఎంను కాపాడేందుకు ఓ గ్లోబల్‌ కంపెనీ ముందుకు వచ్చింది. ఫైనాన్స్ రంగ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley), పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు చెందిన సుమారు రూ. 244 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. మోర్గాన్‌ స్టాన్లీ పెట్టిన ఈ పెట్టుబడి పేటీఎంకు కొత్త ఊపిరి లాంటిది. 


మోర్గాన్ స్టాన్లీ, సింగపూర్‌ కేంద్రంగా పని చేసే తను అనుబంధ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఆసియా ద్వారా పేటీఎంలో ఈ వాటాను దక్కించుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) జరిగిన ఈ డీల్‌ ద్వారా దాదాపు 50 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఫలితంగా, పేటీఎంలో మోర్గాన్ స్టాన్లీ వాటా దాదాపు 0.8 శాతంగా ఉంటుంది. NSE డేటా ప్రకారం, ఒక్కో పేటీఎం షేర్‌ను షేర్లు మోర్గాన్ స్టాన్లీ సగటున రూ. 487.20 చొప్పున తీసుకుంది. ఈ డీల్ కోసం రూ. 243.60 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఈ షేర్లను ఎవరు విక్రయించారన్న సమాచారం మాత్రం తెలియలేదు.


రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన ఆంక్షల వల్ల కంపెనీ నిర్వహణ లాభం (operating profit) మీద ఏడాదికి రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ప్రభావం పడొచ్చని పేటీఎం అంచనా వేసింది. పరిస్థితిని సమీక్షించి, లాభదాయకత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తామని గురువారం స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేటీఎం వెల్లడించింది.


ఆర్‌బీఐ ఆంక్షలతో భారీ నష్టం
ఈ నెల 29 (ఫిబ్రవరి 29) తర్వాత కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, వాలెట్లు & ఫాస్ట్‌ట్యాగ్‌, NCMC కార్డ్‌ వంటివి టాప్‌-అప్‌ చేయకుండా, ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించకుండా.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం ఆంక్షలు విధించింది. ఈ ప్రభావంతో, గత గురువారం ట్రేడింగ్‌లో 20% పతనమైన పేటీఎం షేర్లు, శుక్రవారం కూడా 20% తగ్గి రూ. 487.20 దగ్గర లోయర్‌ సర్క్యూట్‌లో చిక్కుకున్నాయి. గురువారం పతనం ఫలితంగా రూ. 38.66 వేల కోట్లకు పడిపోయిన పేటీఎం మార్కెట్‌ విలువ (Paytm Market Cap), శుక్రవారం పతనం తర్వాత రూ. 30.94 వేల కోట్లకు దిగి వచ్చింది.


పేటీఎం షేర్‌ ధర గత ఆరు నెలల కాలంలో రూ.288.90 లేదా 37.22% తగ్గింది. గత ఒక ఏడాది కాలంలో దాదాపు 11%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 25% క్షీణించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫారెక్స్‌ ఖజానా కళకళ - పెరిగిన విదేశీ కరెన్సీ, బంగారం నిల్వలు