Special Trading Session On 2nd March 2024: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) శనివారం కూడా ట్రేడింగ్‌ జరుగుతుంది. అయితే, అది ఈ వారంలో వచ్చే శనివారం నాడు కాదు. రెండు వారాల తర్వాత, 2024 మార్చి 2న, శనివారం రోజున స్పెషల్‌ ట్రేడింగ్ సెషన్‌ నిర్వహిస్తాయి. దీని గురించి ఈ రెండు ప్రధాన ఎక్సేంజ్‌లు ప్రకటన విడుదల చేశాయి. 


మార్చి 2న జరిగే ప్రత్యేక సెషన్‌లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ బుధవారం సర్క్యులర్‌ను జారీ చేశాయి. ఆ రోజున, డిజాస్టర్ రికవరీ సైట్ (Disaster Recovery Site) వద్ద ఇంట్రాడే నిర్వహిస్తారు. సైబర్ దాడులు, సాంకేతిక సమస్యల వంటి ఆకస్మిక సందర్భాల్లో డేటాను రక్షించేలా DR సైట్ పని చేస్తుంది. ఫలితంగా, ట్రేడింగ్ మరింత సురక్షితంగా మారుతుంది.


రెండు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లు
ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. మార్కెట్‌ పార్టిసిపేంట్స్‌ అందరూ మార్చి 2న డీఆర్‌ సైట్ (DR Site) కోసం ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌కు సిద్ధం కావాలి. ఈ సమయంలో ట్రేడింగ్‌ ప్రాథమిక సైట్ నుంచి DR సైట్‌కి బదిలీ అవుతుంది. రెండు సెషన్లలో ఈ ట్రేడ్‌ జరుగుతుంది. మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు; రెండో ట్రేడింగ్ సెషన్ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. ఈ ప్రత్యేక సెషన్‌ను ఈ ఏడాది జనవరి 20నే నిర్వహించాల్సి ఉంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కారణంగా ప్రత్యేక సెషన్‌ వాయిదా పడింది. జనవరి 22న ఈక్విటీ మార్కెట్‌కు సెలవు కూడా ఇచ్చారు. దీనికి బదులుగా, అదే వారంలోని శనివారం నాడు పూర్తి స్థాయిలో మార్కెట్లను నిర్వహించారు.


డీఆర్‌ సైట్ తేవడానికి కారణం
మూడేళ్ల క్రితం, 2021 ఫిబ్రవరి 24న, NSEలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ ఆ రోజు ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 03.45 గంటల మధ్య నిలిచిపోయింది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యకు టెలికాం ప్రొవైడర్ కంపెనీని బాధ్యులుగా చేశారు. అత్యవసర సందర్భాల్లో డేటాను రక్షించుకునే వ్యవస్థ ఉండాలని అప్పుడే నిర్ణయించారు. ఈ కారణంగానే విపత్తు పునరుద్ధరణ సైట్‌ను తీసుకొచ్చారు. 


డిజాస్టర్ రికవరీ సైట్‌కు మారడం ద్వారా, ఆ సైట్ ఎలా పని చేస్తుందో తనిఖీ చేయాలి. ఇంకా ఏవైనా మార్పులు, నవీకరణలు అవసరమైతే వాటినీ చొప్పించాలి. దానిని అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దాలి. ఆ సైట్‌ సాయంతో, సైబర్ దాడులు, సర్వర్ క్రాష్‌లు, ఇతర సమస్యల నుంచి ట్రేడింగ్‌కు రక్షణ కల్పించొచ్చు. ఇది మార్కెట్‌ను, పెట్టుబడిదార్లను కాపాడుతుంది. 


మార్చి 2న జరిగే ప్రత్యేక సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్‌ సహా అన్ని సెక్యూరిటీల గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ కాంట్రాక్టులకు కూడా ఇది 5 శాతంగా ఉంటుంది. సెబీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనేవారికి మంచి టైమ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే