New Investments: బిగ్‌ బుల్‌ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తర్వాత, ఆయన పోర్ట్‌ఫోలియోను రాకీ భాయ్‌ భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం, డిజిటల్ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్‌లో రేఖకు 9.96% వాటా ఉంది. కామత్ బ్రదర్స్‌కు చెందిన జీరోధ (Zerodha), SBI మ్యూచువల్ ఫండ్ (SBI MF) ఇప్పుడు ఈ కంపెనీపై కన్నేశాయి. ఈ రెండు సంస్థలు కలిసి రూ.510 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. నజారా టెక్నాలజీస్‌లోకి కొత్తగా ఇద్దరు బిగ్‌ ప్లేయర్లు ఎంట్రీ తీసుకుంటుండడంతో, ఈ కంపెనీ షేర్‌హోల్డర్లు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. 


ఈ రోజు (శుక్రవారం, 08 సెప్టెంబర్‌ 2023) మార్నింగ్‌ సెషన్‌లో నజారా టెక్నాలజీస్‌ షేర్లు 4.4% ర్యాలీ చేశాయి, రూ.900 మార్క్‌ను దాటాయి. ఈ వార్త రాసే సమయానికి షేర్లు రూ.916.10 వద్ద ఇంట్రాడే హైని చేరుకున్నాయి, BSEలో 52 వారాల గరిష్ట స్థాయికి (రూ.927.25) సమీపంలోకి వెళ్లాయి. నిన్న, ఈ స్టాక్‌ రూ. 877.10 వద్ద క్లోజ్‌ అయింది.


BSEలో 52 వారాల కనిష్ట స్థాయి అయిన రూ. 481.95 నుంచి ఇప్పటి వరకు నజారా టెక్నాలజీస్‌ షేర్లు 90% పైగా పెరిగాయి. 


ఒక్కో షేరును రూ.714 చొప్పున జారీ
రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, జీరోధ, SBI MFకు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడానికి నజారా టెక్నాలజీస్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన, మొత్తం 71,42,856 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరును రూ.714 చొప్పున కంపెనీ జారీ చేస్తుంది. 


ఈ డీల్స్‌ మొత్తం విలువ రూ. 509.99 కోట్లు. ఇందులో, SBI మ్యూచువల్ ఫండ్ కంపెనీ 409.99 కోట్ల రూపాయలను ఇన్ఫ్యూజ్ చేస్తుంది. నజారా టెక్నాలజీస్‌, SBI MFకి ఒక్కో షేరును రూ.714 చొప్పున 57,42,296 ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. SBI మ్యూచువల్ ఫండ్‌కు చెందిన SBI మల్టీక్యాప్ ఫండ్, SBI మాగ్నమ్ గ్లోబల్ ఫండ్, SBI టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ పథకాల కోసం ఈ పెట్టుబడి ఉంటుంది.


నిఖిల్ కామత్ & నితిన్ కామత్‌కు చెందిన భాగస్వామ్య సంస్థలు కామత్ అసోసియేట్స్, NKSquaredకు తలో 7,00,280 షేర్లను నజారా టెక్నాలజీస్‌ ఇష్యూ చేస్తుంది.


కొత్త పెట్టుబడులు, వ్యూహాత్మక కొనుగోళ్లు సహా కంపెనీ అవసరాలు, వృద్ధి లక్ష్యాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ రూ.510 కోట్లను ఉపయోగించాలని నజారా యోచిస్తోంది. దీంతోపాటు, తన అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్ల కోసం కూడా డబ్బును వాడుకుంటుంది.


ఈ ఏడాది జూన్ 30 నాటికి, రేఖ ఝున్‌ఝున్‌వాలాకు నజారా టెక్నాలజీస్‌లో 65,88,620 ఈక్విటీ షేర్లు లేదా 9.96% వాటా ఉంది. ప్రస్తుతం, నజారాలో అతి పెద్ద పబ్లిక్ స్టేక్‌హోల్డర్లలో ఆమె ఒకరు. ఆమె వాటా విలువ ప్రస్తుతం రూ.578 కోట్లకు పైగా ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తీర్చలేనన్ని అప్పులు నెత్తి మీదున్నా కొత్త కంపెనీ స్టార్ట్‌ చేసిన అనిల్‌ అగర్వాల్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial