Nikhil Kamath: 


మొబైల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నజారా టెక్నాలజీస్‌ (Nazara Technologies) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జెరోధా ఫౌండర్స్‌ నిఖిల్‌ కామత్‌, నితిన్ కామత్‌కు కొంత వాటాను విక్రయిస్తోంది. రూ.100 కోట్ల విలువైన షేర్లను ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది.


'14,00,560 షేర్లను విక్రయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేరును రూ.714 చొప్పున రూ.99,99,99,840 విలువైన వాటాను కామత్‌ అసోసియేట్స్‌, ఎన్‌కే స్క్వేర్డ్‌ కంపెనీలకు విక్రయిస్తున్నాం' అని నజారా టెక్నాలజీస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.


తాజా వాటా కొనుగోలుతో నజారా టెక్నాలజీస్‌లో నిఖిల్‌ కామత్‌ వాటా ఒక శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఏదేమైనా ఈ వార్త ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. దాంతో సోమవారం కంపెనీ షేరు ధర ఉదయం 11.38 శాతం మేర పెరిగి రూ.846 వద్ద ట్రేడయింది.


'భారత టెక్నాలజీ ఎరీనా విజయానికి నిఖిల్‌ కామత్‌ ప్రతిరూపం. ఈ నిధుల సమీకరణ నజారాకు గొప్ప విలువను తీసుకొస్తుంది. దేశంలో వైవిధ్యమైన గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను మేం రూపొందిస్తాం నిధుల సమీకరణను పక్కన పెడితే ఈ పెట్టుబడి నజారా టెక్నాలజీస్‌పై నిఖిల్‌ కామత్‌కు ఉన్న అంతులేని విశ్వాసాన్ని చూపిస్తోంది' అని నజారా టెక్నాలజీస్‌ సీఈవో నితీశ్‌ మిట్టెర్‌సాయిన్‌ అన్నారు. సేకరించిన నిధులను వ్యూహాత్మక విలీనాలు, వృద్ధి కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు.


నజారా టెక్నాలజీస్‌లో నిఖిల్‌ కామత్‌ వాటా పెంచుకుంటున్నారని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇప్పుడదే నిజమైంది. కాగా అతడికి బదిలీ చేసిన షేర్లు ఇష్యూ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఎవరికీ విక్రయించేందుకు వీల్లేదు. అయితే జులైలోనే నిఖిల్‌ తన వాటాను రూ.30 నుంచి 50 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే.


'20 ఏళ్ల కన్నా తక్కువ వయసు కేటగిరీలో గేమింగ్‌ గ్రోత్‌ క్రేజీగా ఉంది. కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ ఇండస్ట్రీ వృద్ధి చెందుతోంది. భారత్‌లో నజారాకు తిరుగులేదు. ఈ-స్పోర్ట్స్‌లో సృజనాత్మకంగా వినూత్నంగా ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇంటర్నేషనల్‌ కంపెనీలతోనూ పోటీ పడుతుందని నా నమ్మకం. ఈ పెట్టుబడితో జెరోధాకు సంబంధం లేదు. వ్యక్తిగత పెట్టుబడి' అని నిఖిల్‌ కామత్‌ తెలిపారు.


స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. సెప్టెంబర్‌ డెరివేటివ్స్‌ సిరీస్‌ మొదలవ్వడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల జోష్‌లో ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్లు పెరిగి 19,481 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 95 పాయింట్లు పెరిగి 65,482 వద్ద కొనసాగుతున్నాయి. జియో ఫిన్‌ మళ్లీ లిస్టింగ్‌ ధరకు చేరుకుంది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు తగ్గాయి.


Also Read: షూరిటీ లేకుండా లోన్‌, పైగా వడ్డీ తక్కువ - ఎల్‌ఐసీ పాలసీ ఉంటే చాలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.