Vehicles Sales Down: 


ఫిబ్రవరిలో జరిగిన వాహన అమ్మకాల్లో మారుతీ సుజుకీ (Maruti Suzuki), హ్యుందాయ్‌ (Hyundai) ఇండియా వాటాలో కోత పడింది. ఇదే సమయంలో టాటా మోటార్స్‌, మహీంద్రా, కియా ఇండియా మార్కెట్లో తమ వాటా పెంచుకున్నాయి. వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) లెక్కల ప్రకారం గత నెలలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) రిటైల్‌ అమ్మకాలు 1,18,892 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,09,611 కావడం గమనార్హం. మొత్తం విక్రయాల్లో కంపెనీ వాటా మాత్రం వార్షిక ప్రాతిపదికన 42.36 శాతం నుంచి 41.40 శాతానికి తగ్గిపోయింది.


మరోవైపు హ్యుందాయ్‌ ఇండియా మార్కెట్‌ వాటా (Hyundai Market Share) 14.95 శాతం నుంచి 13.62 శాతానికి తగ్గింది. గతేడాది ఫిబ్రవరిలో హ్యుందాయ్ 38,688 కార్లను విక్రయించింది. ఈ సారి ఆ సంఖ్య 39,106గా నమోదైంది.


టాటా మోటార్స్ ఫిబ్రవరి నెలలో 38,965 కార్లను విక్రయించి వాటాను 13.57 శాతానికి పెంచుకుంది. అలాగే మహీంద్రా అండ్‌ మహీంద్రా 29,356 కార్ల విక్రయాలతో 10.22 శాతం వాటాను సొంతం చేసుకుంది.


కియా ఇండియా విక్రయాలు 19,554 యూనిట్లకు చేరుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన మార్కెట్‌ వాటా 5.27 శాతం నుంచి 6.81 శాతానికి పెరిగింది. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ విక్రయాల వాటా ఫిబ్రవరిలో పుంజుకుంది. హోండా కార్స్‌, రెనో, ఎంజీ మోటార్‌, నిస్సాన్‌ వాటా తగ్గింది.


మారుతీ సుజుకి


మారుతీ సుజుకి 2023 ఫిబ్రవరిలో మొత్తం 1,72,321 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో ఐదు శాతం పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్లో కంపెనీ గతేడాది ఇదే నెలలో 1,50,823 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరిలో కంపెనీ ఆల్టో, ఎస్-ప్రెస్సో 21,875 యూనిట్లలు అమ్ముడుపోయాయి. కాంపాక్ట్ విభాగంలో 79,898 యూనిట్లు, ఎస్‌యూవీ విభాగంలో 33,550 యూనిట్లను మారుతి సుజుకి విక్రయించింది. అయితే కంపెనీ ఎగుమతులు మాత్రం 2022 ఫిబ్రవరిలో 24,021 యూనిట్ల నుంచి 17,207 యూనిట్లకు తగ్గాయి.


భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. దీని కారణంగా ఒకదాని తర్వాత మరొకటిగా కార్ల తయారీదారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా తన ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3ని భారత దేశ మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండు ట్రిమ్‌లలో లాంచ్ అయింది. దేశీయ మార్చెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగోతో పోటీపడనుంది.


కంపెనీ సిట్రోయెన్ ఈసీ3 కారును రూ.11.50 నుంచి రూ.12.43 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లో పరిచయం చేసింది. దాని పోటీదారు టాటా టియాగో ఎలక్ట్రిక్ కంటే సిట్రోయెన్ ఈసీ3 కారు ధర రూ. 1.31 లక్షలు ఎక్కువ కావడం విశేషం.


ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 107 కిలో మీటర్లుగా ఉంది. ఇది కాకుండా ఛార్జింగ్ చేయడానికి రెండు ఛార్జింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి 15A ఛార్జింగ్ సాకెట్ ద్వారా ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. రెండోది డీసీ ఫాస్ట్ ఛార్జర్. దీని ద్వారా ఈ కారు కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వగలదు.