Jio Financial Services Shares Listing: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లకు ఈ నెల 20వ తేదీ కీలకమైన రోజు. 2023 జులై 20న, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విషయంలో ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్‌ నిర్వహించనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్థిక సేవల వ్యాపారం అదే రోజున డీమెర్జ్ అవుతుంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ చేస్తున్న రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ను RIL నుంచి వేరు చేయడం కోసం ప్రత్యేక సెషన్‌ నిర్వహించనున్నట్లు NSE వెల్లడించింది.


రికార్డు తేదీ జులై 20
రిలయన్స్ ఇండస్ట్రీస్, తన డీమెర్జ్‌డ్‌ ఎంటిటీ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ (Reliance Strategic Investments Limited) షేర్లను అర్హులైన వాటాదార్లకు కేటాయించడానికి జులై 20ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. విభజన పథకం కింద, షేర్‌హోల్డర్లు హోల్డ్‌ చేస్తున్న ప్రతి ఒక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌కు ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేర్‌ ఇస్తారు. ఇలా, ఎన్ని రిలయన్స్‌ షేర్లు ఉంటే అన్ని ఫైనాన్షియల్ షేర్లు ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లకు లభిస్తాయి. ఆ తర్వాత రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌ (RSIL) పేరు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ లిమిటెడ్‌గా (JFSL) మారుతుంది. కొత్త పేరుతో ఆ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను డీమెర్జ్‌ చేయడానికి ఈ నెల 7న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) అనుమతి ఇచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను లిస్ట్‌ చేసే ప్రయాణంలో ఇదే కీలక అడుగు.


నిఫ్టీ50 సహా చాలా ఇండెక్సుల్లోకి ఎంట్రీ టిక్కెట్‌
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేర్లు, నిఫ్టీ ఎలైట్‌ క్లబ్‌ అయిన నిఫ్టీ50లోకి ఎక్కుతాయి. నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500 ఇండెక్స్‌తో పాటు, ఇది మరో 18 సెక్టోరల్ ఇండెక్స్‌ల్లోకి ఎంట్రీ ఇస్తుంది. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్‌ల్లోనూ యాడ్‌ అవుతుంది. 


మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. దీన్నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కంపెనీ విభజన & లిస్టింగ్‌ వల్ల, RILలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల మంది షేర్‌హోల్డర్లకు వాల్యూ అన్‌లాక్ అవుతుంది.


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్‌ ప్రైస్‌ అంచనాలు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్‌ ప్రైస్‌కు సంబంధించి బ్రోకరేజ్ హౌస్‌ల అంచనాలను పరిశీలిస్తే... ఒక్కో షేరు ధర రూ. 189 ఉండవచ్చని JP మోర్గాన్ లెక్క వేసింది. జెఫరీస్ రూ. 179గా & సెంట్రమ్ బ్రోకింగ్ అంచనా ప్రకారం రూ. 157-190గా అంచనా వేసింది.


మరో ఆసక్తికర కథనం: పెరిగిన పసిడి డిమాండ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial