Work From Office: 


ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఇండస్ట్రీ కష్టాల్లో ఉండటం, లాభదాయకత తగ్గడం, అట్రిషన్‌ రేటు పెరగడం, నియామకాలు తగ్గడమే ఇందుకు కారణాలు! ఆఫీసులకు రావడం వల్ల సహోద్యోగులు, యాజమాన్యంతో అనుబంధం పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి.


తమ ఉద్యోగుల్లో సగం మంది వారంలో కనీసం రెండు రోజులు ఆఫీసులకు వస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTI Mindtree), విప్రో (Wipro), పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ వంటి కంపెనీలు చెబుతున్నాయి. కరోనా రావడంతో అందరి కన్నా ముందుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను (Work From Home) అందిపుచ్చుకున్నది ఐటీ ఇండస్ట్రీయే! దేశ విదేశాల్లో అన్ని కంపెనీలు డిజిటలైజేషన్‌ బాట పట్టడంతో వారికి డిమాండ్‌ పెరిగింది.  ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి క్లెయింట్లకు అప్పగించాలని, కార్యాలయాలకు అద్దె, రవాణా, ఇతర ఖర్చులు మిగలడంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఎక్కువగా ఎంకరేజ్‌ చేశారు. మహమ్మారి బాధ తప్పినా చాలా మంది ఆఫీసులకు రావడానికి ఇష్టపడటం లేదు.


గతేడాది సెప్టెంబర్‌ నుంచి టీసీఎస్‌లో ఉద్యోగులు ఆఫీసులకు రావడం మొదలు పెట్టారు. 'మా ఉద్యోగులు ఆఫీసులకు రావడం వేగవంతమైంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 55 శాతం మంది వారంలో కనీసం మూడు రోజులు పంచ్‌ కొడుతున్నారు' అని టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ మిలింద్‌ లక్కడ్‌ అన్నారు. ఈ ఏడాది చివరి వరకు 70-75 శాతం మంది ఆఫీసులకు వస్తారని హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయ్‌ కుమార్‌ అంచనా వేస్తున్నారు. వారంలో తమకు నచ్చిన మూడు రోజుల్లో ఆఫీసుకు వచ్చేలా విప్రో ప్రోత్సహిస్తోంది. 'మా ఉద్యోగుల్లో కనీసం 55 శాతం మంది వారంలో మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారు' అని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు.


ఆఫీసులకు రావాలని చెప్పడంతో మహిళా ఉద్యోగుల్లో అట్రిషన్‌ రేటు పెరిగిందని టీసీఎస్‌ తెలిపింది. అయితే కచ్చితమైన రేటు వెల్లడించలేదు. కరోనా సమయంలో మహిళలు ఇంటికి అలవాటు పడటం, మరికొన్ని మార్పులు రావడం ఉద్యోగాలు మానేయడానికి కారణాలని లక్కడ్‌ పేర్కొన్నారు. గతేడాది 17.4 శాతంగా ఉన్న అట్రిషన్‌ రేటు ఈసారి 20.1 శాతానికి పెరిగిందని వెల్లడించారు. మొత్తం 614,795 మంది ఉద్యోగుల్లో 35.7 శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు.


తమ ఉద్యోగుల్లో కనీసం 30-40 శాతం మంది ఆఫీసులకు వస్తున్నారని ఎల్‌టీఐ మైండ్‌ట్రీ సీఈవో దేబాశీష్‌ ఛటర్జీ తెలిపారు. నగరాన్ని బట్టి కొంత తేడా ఉందన్నారు. ఆఫీసులకు వచ్చి పనిచేయడంలో ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నామని పేర్కొన్నారు. క్లెయింట్లను బట్టి ఫ్లెక్లిబిలిటీ ఉంటుందన్నారు. 'భారత్‌లో మాకు 20,000 వరకు ఉద్యోగులు ఉన్నారు. అందులో 11,000కు పైగా వారం ప్రాతిపదికన ఆఫీసుకు వస్తున్నారు' అని పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ సందీప్‌ కర్లా అన్నారు. కంఫర్ట్‌ జోన్‌ వదిలి వచ్చేందుకు కొందరు ఇష్టపడటం లేదని, ఆశావహ దృక్పథంతో వారికి నచ్చజెపుతున్నామని పేర్కొన్నారు.