Global Health IPO: మేదాంత (Medanta) బ్రాండ్‌తో హాస్పిటల్‌ వ్యాపారం చేస్తున్న గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ IPO నవంబర్‌ 3, 2022న ప్రారంభమైంది. IPO సైజ్‌ ₹ 2,206 కోట్లు. అన్ని మార్కెట్లలో వ్యాపారం పెంచుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించాలన్నది కంపెనీ ప్రణాళికగా తెలిసింది. గ్లోబల్‌ హెల్త్‌ షేర్లు ఈ నెల 16న BSE, NSEలో లిస్ట్‌ అవుతాయి. ముందస్తు ప్రణాళిక మారితే లిస్టింగ్‌ తేదీలు కూడా మారే అవకాశం ఉంది. ఫండమెంటల్‌గా కంపెనీ మెరుగ్గా ఉండటంతో ఐసీఐసీఐ డైరెక్ట్‌ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


ఐసీఐసీఐ రేటింగ్‌


'గ్లోబల్‌ హెల్త్‌ గుర్తింపు మేదాంత బ్రాండ్‌తోనే ముడిపడింది. డాక్టర్‌ తెహ్రాన్, గురుగ్రామ్‌లోని మేదాంత ది మెడ్‌సిటీకి ఎంతో పేరుంది. అప్పర్ ప్రైస్‌ బ్యాడ్‌ ధరతో పోలిస్తే విలువ 21 రెట్లుగా ఉంది. లాభదాయకత మెరుగవ్వడం, ఫండమెంటల్‌గా బాగుండటం, డీసెంట్‌ వాల్యుయేషన్స్‌ కావడంతో ఐపీవోపై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. అందుకే మేం సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం' అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వెల్లడించింది.


ప్రైస్‌ బ్యాండ్‌


IPO తేదీలు:  ఇవాళ ప్రారంభమైన ఈ ఇష్యూ సోమవారం (నవంబర్ 7, 2022) ముగుస్తుంది. నిన్న (బుధవారం) యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరిగింది.
ప్రైస్ బ్యాండ్: గ్లోబల్ హెల్త్ ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ ₹2. ఒక్కో ఈక్విటీ షేరుకు IPO ధరను ₹319-336గా కంపెనీ నిర్ణయించింది.


గ్రే మార్కెట్ వివరాలు


ఇష్యూ మొదటి రోజు ఒక్కో షేరుకు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ₹25గా ఉంది. రెండో రోజుకు ఇది రూ.17కు చేరుకున్నట్టు తెలిసింది. IPO ధర కంటే 7.44% ప్రీమియంతో ఈ స్టాక్ ₹361 వద్ద లిస్ట్‌ అవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విన్‌ బిడ్డర్‌లకు నవంబర్ 11న షేర్లను కేటాయిస్తారు. విన్‌ కాని బిడ్డర్‌లకు నవంబర్ 14న రీఫండ్ ఉంటుంది. నవంబర్ 15 నాటికి విన్‌ అయిన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాలో షేర్లను జమ చేస్తారు. నవంబర్ 16న ఈ స్టాక్ మార్కెట్‌లోకి వస్తుంది.


లాట్‌ సైజ్


ఏ IPOలో అయినా లాట్‌ రూపంలో బిడ్‌ వేయాలి. ఈ IPOలో 44 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు 1 లాట్‌ కావాలంటే 44 షేర్లకు, 2 లాట్లు కావాలంటే 88 షేర్లకు, ఇలా 44 గుణిజాల్లో బిడ్‌ వేయాలి. ఎగువ ప్రైస్‌ బ్యాండ్‌ (₹336) ప్రకారం... రిటైల్ ఇన్వెస్టర్‌ కనీస పెట్టుబడి (44 షేర్లకు) ₹14,784 అవుతుంది. ఒక రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా 13 లాట్‌లు లేదా 572 షేర్ల కోసం బిడ్‌ వేయవచ్చు. ఈ లెక్కన గరిష్ట పెట్టుబడి ₹1,92,192 అవుతుంది. ఇష్యూ సైజ్‌లో సగం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.


కార్డియాలజిస్ట్ నరేష్ త్రెహాన్‌ ఈ సంస్థను స్థాపించారు. IPOలో.. ₹500 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 5.08 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది. టైర్ II, టైర్ III నగరాల్లో కూడా వీలైనంత ఎక్కువ మందికి సరసమైన ధరలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో త్రెహాన్ చెప్పారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.