Private Gold Mine in India: త్వరలో, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గని నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని తవ్వి తీయబోతున్నారు. ఇది, దేశంలోనే తొలి, అతి పెద్ద ప్రైవేట్ బంగారు గని (large private gold mine in Andhra Pradesh). ఈ మైన్ ఓనర్‌ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (Deccan Gold Mines Ltd - DGML). 


కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల మధ్య ఈ బంగారు గని ఉంది. దీనిని జొన్నగిరి గోల్డ్‌ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు.


ఏడాదికి 750 కిలోలు తవ్వి తీసేందుకు ప్లాన్‌
జొన్నగిరి ప్రాజెక్టులో పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ గనిలో ప్రయోగాత్మకంగా మైనింగ్‌ పనులు జరుగుతున్నాయి, నెలకు ఒక కిలో పసిడిని (ఏడాదికి 12 కిలోలు) బయటకు తీస్తున్నారు. 2024 అక్టోబరు-నవంబరు నాటికి ఫుల్‌ స్కేల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభం అవుతుంది, అప్పుడు ఏడాదికి 750 కిలోల బంగారాన్ని (నెలకు సగటున 62.5 కిలోలు) ఉత్పత్తి చేస్తామని కంపెనీ MD ప్రసాద్ చెప్పారు.


జొన్నగిరి బంగారు గనిని అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో DGMLకు 40 శాతం భారీ వాటా ఉంది. ఈ గని కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ తొలి ప్రైవేట్‌ గనికి 2013లోనే అనుమతులు వచ్చాయి. బంగారాన్ని తవ్వి తీయడానికి అవసరమైన ముందస్తు పనులన్నీ పూర్తి చేయడానికి 8-10 సంవత్సరాలు పట్టింది.


డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు, కిర్గిజ్‌స్థాన్‌లోనూ ఒక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు (ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు) ఉంది. ఆ గనిలో DGMLకి 60 శాతం వాటా ఉంది. అక్కడ కూడా గోల్డ్‌ ప్రొడక్షన్‌ 2024 అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు నుంచి ఏటా దాదాపు 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ప్లాన్‌.


DGMLను 2003లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రమోటర్లకు ఎక్స్‌ప్లోరేషన్‌ & మైనింగ్ సెక్టార్‌లో మంచి అనుభవం ఉంది. DGML చాలాకాలంగా భారత్‌ సహా విదేశాల్లో బంగారు అన్వేషణ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో DGML అన్వేషణ ఫలితంగా హట్టి, ధార్వార్-షిమోగా ప్రాంతాల్లో గోల్డ్‌ డిపాజిట్స్‌ బయటపడ్డాయి.


2021 నుంచి, వ్యాపార విస్తరణ & వైవిధ్యం కోసం ఇతర కంపెనీలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడాన్నీ DGML కొనసాగిస్తోంది.


గోల్డెన్‌ స్టాక్‌
బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, BSEలో లిస్ట్‌ అయిన మొదటి & ఏకైక 'బంగారం అన్వేషణ సంస్థ' ‍‌(gold exploration company) దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML). వచ్చే ఏడాది చివర నుంచి జొన్నగిరి గోల్డ్‌ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో బంగారం ఉత్పత్తి ప్రారంభిస్తారన్న వార్తతో ఈ స్టాక్‌ ఈ రోజు రూ. 95.52 వద్ద 5% అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది. కేవలం గత ఆరు నెలల కాలంలోనే ఈ స్క్రిప్‌ దాదాపు డబుల్‌ (98.34%) అయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 143% రిటర్న్స్‌ ఇచ్చింది. గత ఒక ఏడాది కాలంలో (గత 12 నెలల్లో) ఏకంగా రెండున్నర రెట్లు (253%) పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కళ్లెం వదిలిన గుర్రంలా గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial