Stock Market News In Telugu: స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ లేదా డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి అనగానే స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఫస్ట్‌ గుర్తొచ్చే పేరు జీరోధ (Zerodha). ఆ పేరుప్రఖ్యాతులకు 'గ్రో' (Groww) గండి కొట్టింది. 


ఇప్పుడు, ఫిన్‌టెక్ స్టార్టప్ 'గ్రో' దగ్గర జీరోధ కంటే ఎక్కువ మంది క్రియాశీల పెట్టుబడిదార్లు (active investors) ఉన్నారు. యాక్టివ్‌ ఇన్వెస్టర్ల పరంగా 'గ్రో' అతి పెద్ద బ్రోకరేజ్ కంపెనీగా అవతరించింది.


NSE డేటా ప్రకారం, సెప్టెంబర్ 2023 చివరి నాటికి, 'గ్రో'లో 6.63 మిలియన్ల యాక్టివ్‌ ఇన్వెస్టర్లు ఉన్నారు, జీరోధ దగ్గర 6.48 మిలియన్ల మంది ఉన్నారు. 


2014లో 'గ్రో' ప్రారంభమైంది. నెక్ట్స్‌బిలియన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (Nextbillion Technology Private Ltd) యాజమాన్యంలో పని చేస్తోంది. ఆర్థిక సమాచార సేవలు, పెట్టుబడుల నిర్వహణ, పన్నులు, మ్యూచువల్ ఫండ్స్‌లో 'గ్రో' బిజినెస్‌ చేస్తోంది.


టాప్‌ 3, 4, 5 బ్రోకింగ్‌ కంపెనీలు
4.86 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదార్లతో ఏంజెల్ వన్ (Angel One) థర్డ్‌ ప్లేస్‌లో ఉండగా, మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన అప్‌స్టాక్స్ ‍‌(Upstox) 2.19 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదార్లతో ఫోర్త్‌ ర్యాంక్‌ సాధించింది.


అప్‌స్టాక్స్ 2009లో ప్రారంభమైంది, RKSV సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీని ఓనర్‌. స్టాక్స్‌ ట్రేడింగ్‌, మ్యూచువల్ ఫండ్స్‌, IPO సెగ్మెంట్లలో అప్‌స్టాక్స్ బిజినెస్‌ చేస్తోంది. 


ICICI సెక్యూరిటీస్ 1.91 మిలియన్ల ఖాతాదార్లతో ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది.


మనీకంట్రోల్ న్యూస్‌ రిపోర్ట్‌ ప్రకారం, FY23 చివరి నాటికి 'గ్రో' చేతిలో 5.37 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు, జీరోధ అకౌంట్‌లో 6.39 మిలియన్లు మంది ఉన్నారు. FY21లో సుమారుగా 0.78 మిలియన్ల వినియోగదార్ల నుండి FY22లో 3.85 మిలియన్లకు, FY23లో 5.78 మిలియన్ల పెట్టుబడిదార్లకు చేరిన 'గ్రో' గణనీయమైన వృద్ధిని సాధించింది.


సెప్టెంబర్ చివరి నాటికి మన దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 12.97 కోట్లు ఉంటాయని అంచనా. NSE డేటా ప్రకారం, 3.34 కోట్ల మంది భారతీయులు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడ్‌ తీసుకుంటున్నారు.


ఆదాయం, లాభం
భారతదేశంలో అతి పెద్ద స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జీరోధ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాటమ్-లైన్, టాప్-లైన్‌లో తక్కువ వృద్ధిని సాధించింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో మాత్రం అద్భుతంగా రాణించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కంటే నెమ్మదిగా వృద్ధి చెందినా, FY23లో జీరోధ నికర లాభం 39% YoY పెరిగి ₹2,900 కోట్లకు చేరుకుంది. ఆదాయం 2022 మార్చి నాటికి ఉన్న ₹4694 కోట్ల నుంచి 35.5% పెరిగి FY23లో ₹6875 కోట్లకు చేరుకుంది.


నెక్స్ట్ బిలియన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (గ్రో), FY23లో ₹1,294 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది, FY22లో నివేదించిన ₹367 కోట్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. FY23లో ₹73 కోట్ల నికర లాభం మిగుల్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బ్రిటానియా, లారస్‌ ల్యాబ్స్‌, ఎన్‌ఎండీసీపై కీలక అప్‌డేట్స్‌ - మీ దగ్గర ఈ స్టాక్స్‌ ఉన్నాయా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial