GQG Partners - Adani: రాజీవ్‌ జైన్‌ గుర్తున్నాడా?, అమెరికన్‌ పెట్టుబడి సంస్థ GQG పార్ట్‌నర్స్‌ కో-ఓనర్‌ ఈయన. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కొట్టిన దెబ్బకు అదానీ గ్రూప్‌ షేర్లు నేలకు కరుచుకున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చి అదానీకి జీవదానం చేసిన ప్రముఖ ఇన్వెస్టర్‌. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటాడు.


2023 జనవరి 24, అమెరికన్‌ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌ నెత్తిన దురదృష్టం తాండవమాడింది. కొన్ని స్టాక్స్ 85 శాతం వరకు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకం కలిగించేందుకు గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో (గత నెలలో) రంగంలోకి వచ్చారు రాజీవ్‌ జైన్‌. అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల షేర్లను ఏకంగా రూ. 15,446 కోట్లకు కొనుగోలు చేసి, గ్రూప్‌ మొత్తానికి జవసత్వాలు అందించారు జైన్‌. ఈ భారీ కొనుగోళ్ల తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి.


బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో జైన్‌
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అతి పెద్ద FIIsలో రాజీవ్ జైన్ ఒకరు. అదానీ గ్రూప్‌పై తాను వెచ్చించిన దాదాపు $2 బిలియన్ల విలువైన ఇన్వెస్ట్‌మెంట్‌ మీద రాజీవ్‌ జైన్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. 100% కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తానంటున్నారు.


"అదానీ గ్రూప్‌ షేర్లు ఐదేళ్లలో మల్టీబ్యాగర్లు కావచ్చు" అని బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో జైన్‌ చెప్పారు. ఆయన కొన్న తర్వాత అదానీ షేర్‌ ధరలు పెరిగాయి కాబట్టి, జైన్‌ పోర్ట్‌ఫోలియోలోని అదానీ షేర్లు ఇప్పటికే లాభాలను చూపిస్తున్నాయి.


అదానీ వ్యాపారాల మీద అపార విశ్వాసం
అదానీ గ్రూప్ విలువ దాని ఆస్తుల్లో ఉందని, షేర్లలో కాదని జైన్ చెప్పారు. భారతదేశ మౌలిక వసతులను మెరుగుపరచడానికి, చైనా వంటి దేశాల నుంచి తయారీని భారత్‌లోకి ఆకర్షించడానికి అదానీ వంటి వ్యాపారవేత్తల వైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. అదానీ గ్రూప్‌ చేపట్టిన అనేక ప్రాజెక్టులు భారతదేశ అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల్లో విస్తరించి ఉన్నాయని చెప్పారు.


ముఖ్యంగా, అదానీ బొగ్గు గనుల వ్యాపారం, డేటా సెంటర్లు, 24 గంటలూ బిజీగా ఉండే ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ మెజారిటీ వాటాను ఆరోగ్యకరమైన వ్యాపార సంకేతాలుగా జైన్‌ చెప్పుకొచ్చారు.


"అదానీ గ్రూప్‌ కంటే ముంబై విమానాశ్రయమే ఎక్కువ విలువైందని మేము నమ్ముతున్నాం" అని జైన్ బ్లూమ్‌బెర్గ్‌తో చెప్పారు. 


హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ను చూసి భయపడలేదు
షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ $153 బిలియన్లను తగ్గింది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపైనా రాజీవ్‌ జైన్‌ మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను చూసి తాను భయపడలేదని జైన్ చెప్పారు.


హిండెన్‌బర్గ్ నివేదిక "10 ఏళ్ల పాతకాలం నాటి వార్తాపత్రికలా ఉంది" అని జైన్ కామెంట్‌ చేసారు. 30 సంవత్సరాల తన పెట్టుబడి వృత్తిలో, "ఒక ఖచ్చితమైన కంపెనీని తాను ఇంతవరకు చూడలేదు" అని చెప్పారు.


హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో ఒకటి ఏమిటంటే, కుటుంబానికి అనుసంధానించబడిన ఆఫ్‌షోర్ ఖాతాల లాబ్రింత్‌ను ఉపయోగించడం ద్వారా, పబ్లిక్ షేర్‌హోల్డర్‌లు కనీసం 25% స్టాక్‌ను కలిగి ఉండాలనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అవసరాలను గ్రూప్ దాటవేస్తుంది. అదానీ ఆరోపణలను ఖండించారు.


"గ్రూప్‌ కంపెనీల్లో అదానీకి 75% కంటే ఎక్కువ వాటా ఉందన్నది హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశాల్లో ఒకటి. నిజంగానే అది మోసమా? ” అని జైన్ అన్నారు. “తన వాటాల గురించి అదానీ సరిగ్గా వెల్లడించలేదు. అంతేతప్ప అది మోసం ఎలా అవుతుంది?" అని జైన్‌ ప్రశ్నించారు.


GQG పార్ట్‌నర్స్‌ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాల కంపెనీలు ఉన్నాయి. చమురు, పొగాకు, బ్యాంకింగ్ వంటి పరిశ్రమల్లో $90 బిలియన్లకు పైగా పెట్టుబడులను ఈ కంపెనీ పెట్టింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.