RBI MPC Meeting: సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రకటించిన ఆర్బీఐ
Bank.in Domain For Banks: ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫలితాలను వెల్లడించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా, బ్యాంకుల కోసం ప్రత్యేక ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

RBI MPC Meeting February 2025 Decisions: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 05 బుధవారం నాడు ప్రారంభమై, ఈ రోజు (శుక్రవారం 07 ఫిబ్రవరి 2025) ముగిసింది. రెపో రేట్ను 0.25% లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో, రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది.
ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫలితాలను (RBI MPC Decisions) వెల్లడించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra), బ్యాంకుల కోసం ప్రత్యేక ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాల కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ మోసాలను (cyber frauds) ఎదుర్కోవడానికి భారతీయ బ్యాంకుల కోసం 'బ్యాంక్.ఇన్' (bank.in) అనే ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ను ప్రారంభించాలని RBI నిర్ణయించింది. భవిష్యత్లో, ఆర్థిక రంగంలోని బ్యాంకింగ్యేతర సంస్థల కోసం ప్రత్యేకంగా 'ఫిన్.ఇన్' (fin.in) డొమైన్ను కూడా తీసుకురావాలన్నది ఆర్బీఐ ప్రణాళిక.
bank.in & fin.in ఎందుకోసం?
సైబర్ నేరగాళ్లు నానాటికీ పేట్రేగిపోతున్నారు, ప్రజల డబ్బు సులభంగా దోచుకుంటున్నారు. అలాంటి సైబర్ మోసాలు & ఫిషింగ్ వంటి ఆర్థిక హానికర కార్యకలాపాలను తగ్గించడంతో పాటు బ్యాంక్లు అందించే ఆర్థిక సేవలకు భద్రత కల్పించడం కోసం ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ లక్ష్యం. తద్వారా ఎక్కువ మంది ప్రజలు సురక్షితంగా డిజిటల్ బ్యాంకింగ్ & చెల్లింపు సేవలకు కనెక్ట్ అవుతారు. వాటిపై వినియోగదారులకు నమ్మకం పెరుగుతుంది. దీని కోసం, 'ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ' (IDRBT) ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుంది. ఈ డొమైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంకులకు విడిగా వివరణాత్మక మార్గదర్శకాలు జారీ అవుతాయి. సైబర్ భద్రత & డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నంలో ఈ చర్య భాగమని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు.
డిజిటల్ భద్రత కోసం AFA
బ్యాంకింగ్ & చెల్లింపు వ్యవస్థలలో డిజిటల్ భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ అనేక చర్యలు తీసుకుంటోంది. దేశీయ డిజిటల్ చెల్లింపుల సమయంలో అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Additional Factor Authentication - AFA) ఈ చర్యలలో ఒకటి. దీనిని టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two Factor Authentication - 2FA) గానూ పిలుస్తారు. విదేశాల్లో ఉండే వ్యాపారులకు చేసే ఆన్లైన్ అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపుల్లో (cross-border digital payments) భద్రత పెంచడానికి, క్రాస్ బోర్డర్ డిజిటల్ పేమెంట్స్కు కూడా 2FAను విస్తరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. దీంతో పాటు, బ్యాంకులు & NBFCలు కూడా సైబర్ రిస్క్లను తగ్గించే చర్యలను మరింత మెరుగుపరిచే కార్యక్రమాలు కొనసాగించాలని RBI సూచించింది.
తగ్గిన రెపో రేట్
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని & దానిని దానిని 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, కేంద్ర బ్యాంకు 'తటస్థ' ద్రవ్య వైఖరి (neutral monetary stance)కు మారింది.
మరో ఆసక్తికర కథనం: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం లెక్కల వరకు - ఆర్బీఐ గవర్నర్ ప్రధాన ప్రకటనలు