Eelon musk: గ్లోబల్‌ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను (Twitter) నిలబెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆ కంపెనీ కొత్త యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) చెప్పారు. గత మూడు నెలలు చాలా కష్టంగా గడిచాయని వెల్లడించారు. ట్విట్టర్‌ను దివాలా (bankruptcy) నుంచి రక్షించడానికి గత మూడు నెలలు రాత్రింబవళ్లు కఠినంగా పని చేసినట్లు ప్రపంచ నం.2 బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. 


ట్విట్టర్‌ను దివాలా నుంచి రక్షించాం: ఎలాన్ మస్క్
‘‘గత మూడు నెలల కాలం చాలా కఠినంగా గడిచింది. ట్విటర్‌ను దివాలా నుంచి రక్షించడం కోసమే ప్రధానంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతోపాటు టెస్లా, స్పేస్‌ఎక్స్‌లో (SpaceX) కీలక బాధ్యతలను కూడా చూసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి బాధ మరొకరికి రావొద్దని ఆశిస్తున్నాను. ట్విట్టర్‌ ప్రయాణం ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రజల నుంచి లభించిన మద్దతు అభినందనీయం’’ అని ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ను దివాలా నుంచి రక్షించినా ఇప్పటికీ కంపెనీలో చాలా సవాళ్లు ఎదురు చూస్తున్నాయని, వాటిని కూడా ఎదుర్కోవాల్సి ఉందని తన ట్వీట్‌లో ఎలాన్‌ మస్క్ పేర్కొన్నారు. 


తన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లాకు (Tesla) సంబంధించిన నిధుల వివాదంలో ఎలాన్ మస్క్ నిన్ననే క్లీన్ చీట్ పొందారు.


గత ఏడాది అక్టోబర్‌లో, 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్‌కు పరిస్థితులు బాగా లేవు. షేర్ల షేర్లు గతంలో ఎన్నడూ లేనంతగా పతనమై, ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత సంపద అతి భారీగా క్షీణించింది. ప్రపంచంలో నంబర్ వన్ ధనవంతుడి స్థాయి నుంచి రెండో స్థానానికి మస్క్‌ పడిపోయారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ఆ దానికి సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చారు. ట్విట్టర్‌ చేతిలోకి రాగానే, అప్పటి వరకు ఉన్న CEO పరాగ్ అగర్వాల్ సహా మరికొందరు ఉన్నతాధికారులను మస్క్‌ తొలగించారు. మస్క్‌ చేతిలోకి వచ్చినప్పటి నుంచి వాణిజ్య ప్రకటనలు బాగా తగ్గిపోయి ట్విట్టర్‌ ఆదాయం గణనీయంగా పడిపోయింది. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయం సహా కొన్ని ప్రాంతాల్లో కంపెనీ ఆఫీసులకు అద్దె కట్టడం కూడా గగనమైంది. ఖర్చులు తగ్గించుకోవడానికి 2,300 మంది ఉద్యోగులను మస్క్‌ తొలగించారు. మిగిలిన సిబ్బందితో గొడ్డ చాకిరీ చేయించినట్లు కూడా అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. సంస్థ సిబ్బందికి ఇచ్చే సౌకర్యాలు, వసతులను కుదించారు. ప్రధానా కార్యాలయంలోని 600 పైగా వస్తువులను వేలం వేసి, రోజువారీ లావాదేవీల కోసం కొంత డబ్బు సంపాదించారు. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా కూడా ఆదాయం రాబట్టుకోవడం ప్రారంభించారు.


గోల్డ్ బ్యాడ్జ్‌కు రుసుము!
బిజినెస్‌ బ్రాండ్ ఖాతా కోసం ఇచ్చిన గోల్డ్‌ బ్యాడ్జ్‌కు త్వరలో ఎలాన్ మస్క్ డబ్బు వసూలు చేయవచ్చని కూడా తెలుస్తోంది. దీని కోసం నెలకు 1000 డాలర్లు ఛార్జ్ చేయవచ్చంటూ ఒక అంతర్జాతీయ మీడియా ఒక వార్తను ప్రచురించింది. అదే సమయంలో, బ్రాండ్‌కు సంబంధించిన మరో ఖాతా కోసం గోల్డ్ బ్యాడ్జ్‌కి అదనంగా రూ. 50 వసూలు చేయవచ్చు.