ED Summon Anil Ambani:రూ.17,000 కోట్ల బ్యాంకు రుణ మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆగస్టు 5న ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ED ఆయనను ఆదేశించింది. 

గత వారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఢిల్లీ నుంచి ముంబై వరకు రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన దాదాపు 35 ప్రదేశాలపై ED దాడులు చేసింది. ఈ దాడుల సమయంలో, అనేక పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ రికార్డులు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి.

దర్యాప్తు సంస్థ వాదన ఏమిటి?

రూ.10,000 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తన దర్యాప్తు నివేదికను ED, ఇతర రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమర్పించింది. రుణ మొత్తాన్ని ఇతర కంపెనీలకు మళ్లించి, మనీలాండరింగ్ పరిధిలోకి వచ్చే నిర్దేశించిన ప్రయోజనం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించారని అందులో స్పష్టంగా వివరించింది. 

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన అనేక కంపెనీలు యెస్ బ్యాంక్ నుంచి తగిన హామీ లేకుండా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాయని, షెల్ కంపెనీల ద్వారా ఇతర పనులకు డబ్బు ఖర్చు చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ గతంలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది, ఆ తర్వాత ED దర్యాప్తు ప్రారంభించింది.

మొత్తం వివాదం పూర్తి వివరాలు ఇవే 

66 ఏళ్ల అంబానీని ఏజెన్సీ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని కోరినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ PTI నివేదించింది. గత వారం ED అంబానీ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన కార్యాలయాల్లో నిర్వహించిన వరుస హై-ప్రొఫైల్ సోదాల తర్వాత ఈ చర్య తీసుకున్నారు. 

ఆర్థిక అవకతవకలు, వివిధ రిలయన్స్ గ్రూప్ సంస్థలకు పంపిణీ చేసిన రుణాలను పెద్ద ఎత్తున మళ్లించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థ జులై 24న విస్తృతమైన దాడులు చేసింది. ఇది ముంబైలోని 35 కంటే ఎక్కువ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా మూడు రోజులుపాటు కొనసాగింది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సోదాలు 50కి పైగా కంపెనీలు, 25 మంది వ్యక్తులకు సంబంధించిన ప్రాంగణాలలో సాగినట్టు తెలుస్తోంది. వీటిలో అనిల్ అంబానీ కార్పొరేట్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న అనేక మంది కార్యనిర్వాహకులు ఉన్నారు.

2017 -2019 మధ్య యెస్ బ్యాంక్ అంబానీ కంపెనీలకు అక్రమంగా రుణాలను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా యెస్ బ్యాంక్ అంబానీ కంపెనీలకు పంపిణీ చేసిన సుమారు రూ. 3,000 కోట్లతో ముడిపడి ఉంది. లంచాలు, అక్రమ రుణ ఆమోదాలు జరిగినట్టుదర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. ఇక్కడ యెస్ బ్యాంక్ ప్రమోటర్లు రుణాలు మంజూరు చేయడానికి ముందు వారి వేర్వేరు సంస్థల ద్వారా నిధులు పొందారని  ఆరోపణలు ఉన్నాయి. 

ఈ లావాదేవీలలో నకిలీ లేదా ఓల్డ్‌ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాటిలో సందేహాస్పద క్రెడిట్ ఆమోదం మెమోలు ఉన్నాయా అని ED ఇప్పుడు పరిశీలిస్తోంది. కొన్ని పెట్టుబడులు బేసిక్ రెస్పాన్సిబులిటీ లేకుండా లేదా బ్యాంకు అంతర్గత క్రెడిట్ విధానాలకు కట్టుబడి ఉండకుండా జరిగినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు, ఇది వ్యవస్థాగత ఉల్లంఘనలకు పాల్పడటమేనని భావిస్తున్నారు.  

గ్రూప్‌లోని రెండు లిస్టెడ్ సంస్థలు, రిలయన్స్ పవర్ ,రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ED చర్యలను అంగీకరిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. కొనసాగుతున్న దర్యాప్తు వారి కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపు, వాటాదారులపై "ఎటువంటి ప్రభావం చూపలేదని" నొక్కి చెప్పాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) దశాబ్ద కాలం నాటి గత లావాదేవీలపై మీడియా రిపోర్ట్‌లపై మాత్రం కంపెనీలు స్పందించలేదు.  

కేసు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ, దారి మళ్లించిన నిధులు, మళ్లించడానికి ఉపయోగించిన షెల్ కంపెనీల పాత్ర  దేశంలో కార్పొరేట్ పాలన, బ్యాంకింగ్ పారదర్శకతపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.