Aditya Birla Group - Adani Group: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన సిమెంట్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్, దక్షిణ భారతదేశ కంపెనీ ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌లో 23 శాతం వాటాను రూ. 1885 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌లోని ఈ వాటాను ఒక్కో షేరుకు రూ. 267 చొప్పున కొనుగోలు చేస్తుంది. జూన్ 27న, స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందు, అల్ట్రాటెక్ సిమెంట్ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగింది. ఇండియా సిమెంట్స్‌లో 7.06 కోట్ల షేర్లను కొనుగోలు చేయడానికి అల్ట్రాటెక్ బోర్డు ఆమోదం తెలిపింది.


ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాతోనే అల్ట్రాటెక్ సిమెంట్ ఆగదని, 100 శాతం షేర్లను కొనుగోలు చేయొచ్చని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్‌ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్ శ్రీనివాసన్‌ ఉన్నారు. ఈ
కంపెనీలో ప్రమోటర్ గ్రూప్‌నకు 28.42 శాతం వాటా ఉంది. 


సిమెంట్ రంగంలో ఆధిపత్యం కోసం పోటీ
ఇండియా సిమెంట్స్‌కు దక్షిణ భారతదేశంలో మంచి పేరు, మార్కెట్‌ వాటా ఉంది. ఇటీవల, గౌతమ్ అదానీకి చెందిన అంబుజా సిమెంట్, హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ను రూ. 10,422 కోట్లకు కొనుగోలు చేసింది. సిమెంట్‌ రంగంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. భవిష్యత్‌లో, ఈ రంగంలో మరిన్ని కొనుగోళ్లను చూసే అవకాశం ఉంది. ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను కొనుగోలు చేసిన అల్ట్రాటెక్ సిమెంట్, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో దానిని ఆర్థిక పెట్టుబడిగా సూచించింది. మరో నెల రోజుల్లో ఈ డీల్‌ పూర్తవుతుంది.


ఇండియా సిమెంట్స్‌లో రాధాకిషన్ దమానీ పెట్టుబడి           
ఇండియా సిమెంట్స్‌లోని 23 శాతం వాటాను ఎవరి నుంచి కొనుగోలు చేస్తుందో అల్ట్రాటెక్ సిమెంట్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించలేదు. డీమార్ట్ వ్యవస్థాపకుడు, పెట్టుబడిదారు రాధాకిషన్ దమానీ & అతని కుటుంబానికి ఇండియా సిమెంట్స్‌లో 25.58 శాతం షేర్లు ఉన్నాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు (LIC) కూడా 3.6 శాతం వాటా ఉంది. 


ఇండియా సిమెంట్స్‌ను 1946లో స్థాపించారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ టర్నోవర్‌ను పరిశీలిస్తే.. 2021-22లో రూ. 4858 కోట్లు; 2022-23లో రూ. 5608 కోట్లు; 2023-24లో రూ. 5112 కోట్లుగా ఉంది.


ఆదిత్య బిర్లా గ్రూప్, అల్ట్రాటెక్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 200 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 150 మిలియన్ టన్నులు. గత సంవత్సరం, సిమెంట్ కంపెనీ కేసోరామ్ ఇండస్ట్రీస్‌ను కూడా అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేసింది. ఇండియా సిమెంట్స్‌ ద్వారా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అల్ట్రాటెక్ సిమెంట్‌ సాధించగలదని మార్కెట్‌ నమ్ముతోంది. 


అదానీ గ్రూప్ 2022లో సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. అంబుజా సిమెంట్, ACC, సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌... అల్ట్రాటెక్ సిమెంట్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ రెండేళ్లలోనే రెండో పెద్ద సిమెంట్ బిజినెస్‌గా అవతరించింది.


మరో ఆసక్తికర కథనం: ఒకేసారి భారీ పెద్ద షాక్‌ ఇచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి