Dhirubhai Ambani Birth Anniversary: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ. ఈ సంస్థ వ్యాపారం భారత్‌ సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. దుస్తుల పరిశ్రమగా ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులు ఇప్పుడు ఇంధనం, రిటైల్, మీడియా, వినోదం, డిజిటల్ సేవల వరకు అనేక రంగాల్లోకి విస్తరించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 90వ జయంతి ఇవాళ.


ధీరూభాయ్ అంబానీ జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. ఒకప్పుడు పెట్రోల్ పంపులో రూ.300 జీతానికి పని చేసి, ఆ తర్వాత దేశంలోనే అత్యంత విలువైన కంపెనీని స్థాపించారు. ఆయన జీవితంలో మీకు ఇప్పటి వరకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


1. రూ.500 చేతిలో పట్టుకుని ముంబయి చేరిక
ధీరూభాయ్ అంబానీ 1932 డిసెంబర్ 28న జన్మించారు. 1950ల్లో, ధీరూభాయ్ అంబానీ నెలకు రూ.300 జీతంతో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు పని చేసిన తర్వాత అక్కడే మేనేజర్ అయ్యారు. ఆ తర్వాత, ఆ ఉద్యోగం వదిలేసి సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. రూ.500 చేతిలో పట్టుకుని, వ్యాపారం చేసేందుకు ధీరూభాయ్ అంబానీ ముంబైకి వచ్చినట్లు సమాచారం.


ముంబయి వచ్చిన తర్వాత, ఇక్కడి వ్యాపార పరిస్థితులను అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. అనేక ప్రాంతాలు తిరిగిన తరువాత, పాలిస్టర్ & భారతీయ మసాలా దినుసులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చని అంబానీ గ్రహించారు. 8 మే 1973న, రిలయన్స్ కామర్స్ కార్పొరేషన్ పేరుతో తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. ఈ కంపెనీ, భారతదేశపు సుగంధ ద్రవ్యాలను విదేశాల్లో, విదేశీ పాలిస్టర్లను భారతదేశంలో విక్రయించేది.


2. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి IPO
స్వతంత్ర భారతదేశంలో మొదటి IPOగా రావాలని ధీరూభాయ్ అంబానీ భావించారు. 10 రూపాయల షేరు ధరలో 2.8 మిలియన్ షేర్ల IPOని అందించారు. ఈ IPOపై పెట్టుబడిదారులు చాలా విశ్వాసం ఉంచారు, ఇది ఏడు రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో పెట్టుబడులు పెట్టినవాళ్లకు భారీ లాభాలు వచ్చాయి. టెక్స్‌టైల్ రంగం నుంచి తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ధీరూభాయ్‌ అంబానీ అనుకున్నారు. టెలికమ్యూనికేషన్, టెలికాం ఇన్ఫర్మేషన్‌, ఇంధనం, విద్యుత్, రిటైల్, మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ మార్కెట్, లాజిస్టిక్స్‌కు క్రమంగా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచారు.


3. తక్కువ టారిఫ్ ప్లాన్
ధీరూభాయ్ అంబానీ 2002లో టెలికాం రంగంలోకి ప్రవేశించారు. రూ.600కి సిమ్ సదుపాయాన్ని, నిమిషానికి 15 పైసల టాక్‌టైమ్‌ను రిలయన్స్ అందించింది. దీనికంటే ముందు, ఫోన్‌లో మాట్లాడాలంటే చాలా ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది.


4. గొప్ప టీమ్‌ లీడర్‌
ధీరూభాయ్ అంబానీ అద్భుతమైన టీమ్ లీడర్‌. ఏ ఉద్యోగి అయినా జంకు లేకుండా ఆయన క్యాబిన్‌కు రావచ్చు, మాట్లాడి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. ధీరూభాయ్ అంబానీ అందరి సమస్యలను విని పరిష్కరించేవారు. పెట్టుబడిదారులకు కూడా ఆయన మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంది, ఈ కారణంగానే రిలయన్స్ షేర్లు నిమిషాల్లో అమ్ముడయ్యాయి.


5. 10వ తరగతి చదువు
ధీరూభాయ్ అంబానీ 1932 డిసెంబర్ 28న గుజరాత్‌లోని చోడ్వాడ్‌ నగరంలో జన్మించారు. 1955లో కోకిలా బెన్‌ను (Kokila Ben) వివాహం చేసుకున్నారు. ఆయన కుమారులు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఇద్దరు కుమార్తెలు నీనా అంబానీ, దీప్తి అంబానీ. ధీరూభాయ్ అంబానీ 10వ తరగతి వరకు మాత్రమే చదివారు. ఆయనకు 2016లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ధీరూభాయ్ అంబానీ 6 జులై 2002న గుండెపోటుతో మరణించారు.