China magnet curbs risk halting Indian car production : భారత్లోని కార్ల ప్లాంట్లకు చైనా నుంచి రావాల్సిన ముడిభాగాలు రావడానికి సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఎగుమతి నియంత్రణల కారణంగా భారతదేశంలో ఆటోమొబైల్ ఉత్పత్తి కొన్ని రోజుల్లోనే స్థంభించే ప్రమాదం ఉందని ఆటోమోబైల్ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చైనా, ఆటోమొబైల్స్, గృహోపకరణాలలో ఉపయోగించే రేర్ ఎర్త్ మాగ్నెట్ల గ్లోబల్ ప్రాసెసింగ్ సామర్థ్యంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కెట్ చైనాకు ఉంది. ఏప్రిల్ 2025లో, చైనా ఈ మాగ్నెట్ల ఎగుమతులపై నియంత్రణలను విధించింది. ఈ ముడిపదార్థం కావాల్సిన కంపెనీలు బీజింగ్ నుండి దిగుమతి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ నియంత్రణలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా వచ్చాయి. అయినప్పటికీ గ్లోబల్ ఆటోమేకర్లన్నింటికీ వర్తిస్తున్నాయి.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ మార్కెట్గా ఉంది. చైనా నుండి రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరా తగ్గడం వల్ల భారత ఆటో ఉత్పత్తి మే చివరి నాటికి లేదా జూన్ మొదటి వారంలో స్థంభించే ప్రమాదం ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) ఆందోళన చెందుతోంది. భారత ఆటో రంగం గత ఆర్థిక సంవత్సరం లో చైనా నుండి 460 టన్నుల రేర్ ఎర్త్ మాగ్నెట్లను దిగుమతి చేసుకుంది . ఈ సంవత్సరం 700 టన్నులు దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. అయితే ఏప్రిల్లో 2025లో చైనా ఎగుమతులు 51% తగ్గి 2,626 టన్నులకు పడిపోయాయి. మాగ్నెట్లు ఎలక్ట్రిక్ వాహన మోటార్లతో పాటు సాధారణ కార్లలో పవర్ విండోస్, ఆడియో స్పీకర్లు వంటి భాగాలకు కీలకం.
: చైనా ఎగుమతి నియంత్రణల కారణమంగా ఇప్పుడు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ఎంతో ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంది. భారత కంపెనీలు భారత మంత్రిత్వ శాఖల నుండి అనుమతులు, మాగ్నెట్లు సైనిక ప్రయోజనాల కోసం కాదని నిర్ధారించే పత్రాలు పొందాలి. ఈ పత్రాలను న్యూ ఢిల్లీలోని చైనా ఎంబసీ ధృవీకరించాలి, ఆ తర్వాత చైనా సరఫరాదారులకు పంపించాలి. అప్పుడు బీజింగ్ నుండి లైసెన్స్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుందని, ఇది సరఫరా, ఉత్పత్తిని ఆలస్యం చేస్తుందని భారత కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత-చైనా మధ్య ఉద్రిక్త సంబంధాలు ఈ అనుమతుల ప్రక్రియను మరింత కష్టతరం చేస్తాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగితే జూన్ మొదటి వారంలో ఆటో పరిశ్రమ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని మేకర్లు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, చైనా ఓడరేవులలో నిలిచిపోయిన మాగ్నెట్లను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని SIAM కోరుతోంది. భారత కంపెనీలు ఈ అనుమతులను వేగంగా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందని పలువురు అనుమానిస్తున్నారు.