Cement Prices Increased In India: దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు తిరోగమించాయి. దీంతో, సిమెంట్‌కు డిమాండ్‌ పెరిగి, సిమెంట్‌ ధరలు కూడా పెరిగాయి. 


ఈ ఏడాది, నైరుతి రుతపవనాల (Southwest Monsoon) వల్ల దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. ఆ ప్రత్యక్ష ప్రభావం నిర్మాణ కార్యకలాపాలపై పడింది. సాధారణంగానే వర్షాకాలంలో నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల మరింత స్లో అయ్యాయి. ఇప్పుడు, మాన్‌సూన్‌ సీజన్‌ ‍‌(Monsoon season) ముగియడంతో దేశంలో నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా నివాస గృహాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, అపార్ట్‌మెంట్లు, రహదారులు, కర్మాగారాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు వంటివి చురుగ్గా ప్రారంభమయ్యాయి. ఫలితంగా సిమెంట్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది.


సిమెంట్ ధర ఎంత పెరిగింది?
డిమాండ్‌ పెరిగే సరికి, సిమెంట్‌ కంపెనీలు రేట్లను కూడా పెంచాయి. ఈసారి, 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ. 10 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పెరిగిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దీంతో, వ్యక్తిగత నివాసాల నిర్మాణం నుంచి భారీ ప్రాజెక్టుల వరకు నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఏ నిర్మాణంలోనైనా సిమెంట్‌ది కీలక పాత్ర. సిమెంటు ధర పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగే పరిస్థితి ప్రతి ఏటా కనిపిస్తోంది.


ఈ ఏడాది ప్రారంభంలో పెరగని సిమెంట్ ధరలు
వాస్తవానికి, వేసవి కాలంలో నిర్మాణ కార్యక్రమాలు పీక్‌ స్టేజ్‌లో జరుగుతుంటాయి. అయితే, ఈ సంవత్సరం వేసవిలో మన దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరిగాయి. ప్రవర్తన నియమావళి (Election Code) అమల్లోకి రావడం, దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి, ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభం కావడంతో దేశంలో కొన్ని నెలల పాటు నిర్మాణ కార్యకలాపాలు మందగించాయి. నిర్మాణ కార్యకలాపాలు స్తబ్ధుగా మారడంతో సిమెంట్ డిమాండ్ కూడా తగ్గింది. ఇది సిమెంట్ రేట్లపై ప్రభావం చూపింది. ఫలితంగా ఈ ఏడాది ప్రథమార్థంలో సిమెంట్ బస్తా ధర (Cement Bag Rate) పెంపును అన్ని కంపెనీలు వాయిదా వేశాయి.


సిమెంట్ స్టాక్స్‌లో క్షీణత
గత వారంలో, స్టాక్ మార్కెట్‌లో భారీ పతనంతో దాదాపు అన్ని సిమెంట్ కంపెనీలు దెబ్బతిన్నాయి. శుక్రవారం (04 అక్టోబర్‌ 2024) సెషన్‌లో... అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్‌ ధర 1.99% పడిపోయింది. అంబుజా సిమెంట్ 1.15%, ACC 1.10% తగ్గాయి. KCP 1.26%, JK సిమెంట్‌ 0.14%, శ్రీ సిమెంట్‌ 1.30%, ఇండియా సిమెంట్స్ 0.90%, JK లక్ష్మి సిమెంట్స్ 1.52%, సాగర్ సిమెంట్స్ 1.25%, ఉదయపూర్ సిమెంట్స్ 2% పడిపోయాయి. అన్ని సిమెంట్‌ షేర్లు శుక్రవారం నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఐటీసీ షేర్‌హోల్డర్లకు లడ్డూ లాంటి వార్త - డీమెర్జర్‌లో కీలక ఘట్టం పూర్తి