తెలంగాణలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఇవాళ(శనివారం, 10 ఫిబ్రవరి 2024 ) సభ ముందుకు తీసుకురానున్నారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను, ఇతర హామీలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయనున్నారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్‌ అంచనాలు దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 


12 గంటలకు బడ్జెట్‌


మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ చదువుతారు. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తైనందున పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సింది. కానీ కేంద్రం ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆ బడ్జెట్‌ను ఉదయం 9 గంటలకు మంత్రి మండలి సమావేశమై ఆమోదించనుంది. రాష్ట్రాలకు ఎంత ఇవ్వనుంది. ఏ కేటాయింపులు ఎంత ఉంటాయనేది పూర్తి స్థాయిలో లెక్కలు రావు. అందుకే తెలంగాణలో కూడా ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి మూడు నెలల కాలానికి అసెంబ్లీ అనుమతి తీసుకొని పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూన్‌లో పెట్టనున్నారు. 


ఆరు గ్యారెంటీలపై ఫోకస్ 


కీలకమైన శాఖలతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పుల వడ్డీలకే దాదాపు రెండున్నర కోట్ల లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే ఆ లెక్కలన్ను అంచనా వేసుకొన భారీ స్థాయిలో బడ్జెట్ రూపొందించారు. ఆ దశగానే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చాయిు. గతేడాది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2 లక్షల 90 వేల కోట్ల రూపాయలతో 2023-24 బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చింది. అప్పటి ఖర్చులు, సంక్షేమంతో పోల్చుకుంటే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారాయి. ఆ లెక్కల ప్రకారమే బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. 
ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రదాన హామీలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతి మీటింగ్‌లో కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. అందుకే వాటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలు పరుస్తున్నారు. ఇప్పుడు మరో రెండు అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. వీటితోపాటు మిగతా హామీల అమలు దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. 


ఉద్యోగాల కల్పనపై.. 


ఆరు గ్యారంటీల కోసం దాదాపు 70వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. అందుకే ప్రస్తుతం నాలుగు గ్యారంటీలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని చూస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నందున ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు, ఐదు వందలకే గ్యాస్‌సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలను పక్కాగా అమలు చేయాలి ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. 
గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు కేటాయింపులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రైతు బంధు మినహా మిగిలిన వాటికి మంగళం పాడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటితోపాటు రైతు రుణమాఫీ, పింఛన్లు, ఉద్యోగాల కల్పనపై కూడా ఫోకస్ పెట్టబోతున్నారు. 


నిధులు ఎలా


తెలంగాణను అప్పుల కుప్పగా బీఆర్‌ఎస్ మార్చేసిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు పథకాల అమలు, రాష్ట్ర పాలన కోసం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ వారంలోనే ఐదున్న వేల కోట్లు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది. మరి ఇన్ని పథకాల అమలు కోసం ఆదాయం ఎలా సమకూర్చనందో అన్న అనుమానం చాలా మందిలో ఉంది. దీని కోసం బడ్జెట్‌ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టబోతోందో అన్న చర్చ అయితే నడుస్తోంది. 


గతేడాది బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, మూలధన వ్యయం 37,525 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా 21,471 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 41,259 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో కేంద్రం నుంచి గ్రాంట్‌ల వాటా తగ్గించి చూపించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి ఇది ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై చాలా ఆసక్తి మాత్రం ఉంది.