కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిర్మలా సీతారామన్ ఎలాంటి కీలక ప్రకటనలు చేశారో తెలుసుకుందాం.


157 నర్సింగ్ కాలేజీలు


157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆరోగ్య రంగంలో ఉద్యోగాల పెంపుపై కూడా దృష్టి సారించనున్నారు.


రక్తహీనత వంటి వ్యాధుల అంతం చేయడానికి మిషన్


2047 నాటికి సికిల్ సెల్ రక్తహీనతను నిర్మూలించడానికి ఒక మిషన్‌ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. 40 ఏళ్ల లోపు వాళ్లు దీని బారిన పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో 7 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు.


మెడికల్ రీసెర్చ్ సెంటర్


ఐసీఎంఆర్ ఎంపిక చేసిన ప్రయోగశాలల్లో పరిశోధనలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ వైద్య కళాశాలలు, ప్రైవేటు రంగం బృందాలు కలిసి పరిశోధనలు, ఆవిష్కరణలు చేపట్టేలా ప్రోత్సహిస్తారు.


ఫార్మా ఇన్నోవేషన్


పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టేలా పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. ప్రాథమిక ఆసుపత్రులను కూడా ప్రోత్సహిస్తామన్నారు.


మెడికల్ డివైజెస్ కోసం కోర్సులు


వైద్య పరికరాల కోసం ప్రత్యేక మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెడతారు. భవిష్యత్ వైద్య సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక నిర్మాణం, పరిశోధనలకు కూడా కృషి చేస్తామన్నారు.


2022-23 బడ్జెట్లో ఎంత ఖర్చు చేశారు?


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ.86,200 కోట్లు కేటాయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 16 శాతం అధికం. 2022లో ఆరోగ్య రంగానికి రూ.73,931 కోట్లు కేటాయించారు. నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ను ఈ బడ్జెట్ లో ప్రకటించారు. అలాగే, 2022-23 బడ్జెట్లో నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించారు.


ఏటా ఆరోగ్య రంగానికి పెరిగిన బడ్జెట్
దేశ జీడీపీకి ఆరోగ్య రంగం ఎంతో దోహదం చేస్తుండటం గమనార్హం. ఈ రంగం అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం. ఈ రంగంలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, మెడికల్ షాపులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సంబంధిత విద్య మరియు ఇతర విషయాలు ఉన్నాయి. 2020-21 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.67,112 కోట్లు కేటాయించారు. అదే సమయంలో 2019-20 బడ్జెట్లో రూ.63,538 కోట్లు కేటాయించారు.