BSE Sensex: స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లకు రూ. 3 లక్షల కోట్లకు పైగా ధనవంతులుగా నిలబెడుతూ, ఇవాళ (శుక్రవారం, 03 మార్చి 2023) సెన్సెక్స్ 950 పాయింట్లు పైగా ర్యాలీ చేసింది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ, దేశీయ సిగ్నల్స్‌ను ట్రేడర్లు ఫాలో కావడంతో నిఫ్టీ కూడా 17,600 మార్కు కంటే పైకి దూసుకెళ్లింది.


PSU బ్యాంకులు, అదానీ స్టాక్స్‌ అప్‌సైడ్ బౌన్స్‌లో ముందుండడంతో అన్ని సెక్టార్‌లు & మార్కెట్ విభాగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. 


దలాల్ స్ట్రీట్‌లో ర్యాలీలో కీ రోల్‌ పోషించిన 6 అంశాలు:


ఫెడ్‌ నిర్ణయంపై ఆశలు
అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలను బట్టి, US ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల పెంపునకు మాత్రమే వెళ్తుందని ట్రేడర్లు ఆశలు పెట్టుకున్నారు. ఫెడ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5% నుంచి 5.25% పెంపును బోస్టిక్ సపోర్ట్‌ చేశారు. చాలామంది పెట్టుబడిదార్లు వేసిన 50 బేసిస్‌ పాయింట్ల అంచనా కంటే ఇది తక్కువ. అంతేకాదు, ఎక్కువ మంది ఊహించిన దాని కన్నా త్వరగా, ఈ ఏడాది మధ్యకాలం నాటికి రేటు పెరుగుదలను ఫెడ్‌ నిలిపేస్తుందని బోస్టిక్ చెప్పారు.


గ్లోబల్ మార్కెట్లు
గత రాత్రి వాల్ స్ట్రీట్‌ ర్యాలీని, ఈ ఉదయం ఇతర ఆసియా స్టాక్ మార్కెట్లలో పెరుగుదలను భారతీయ ఈక్విటీ మార్కెట్లు అనుసరించాయి. గత రాత్రి డౌ జోన్స్ 1% లాభంతో ముగియగా, జపాన్ నికాయ్‌ ఈ ఉదయం దాదాపు మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగబాకింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ కూడా 1% గ్రీన్‌లో ట్రేడవుతోంది.


బాండ్ ఈల్డ్స్
ఫెడ్ పాలసీ అంచనాలకు అనుగుణంగా ట్రెజరీ ఈల్డ్స్‌ ఇవాళ వెనకడుగు వేశాయి. US 10-ఇయర్స్‌ ఈల్డ్స్‌ 0.76% తక్కువలో ట్రేడ్‌ అయ్యాయి. 2-ఇయర్స్‌ ఈల్డ్స్‌ కూడా 0.4% తగ్గాయి. బాండ్‌ ఈల్డ్స్‌లో తగ్గుదల, ఈక్విటీ మార్కెట్‌ను పెంచుతుంది.


రూపాయి విలువ
US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఒక నెల గరిష్ట స్థాయికి బలపడింది, ఆసియాలోని ఇతర కరెన్సీల్లో పెరుగుదలకు అనుగుణంగా పెరిగింది. డాలర్‌కు రూపాయి విలువ 0.32% బలపడి 82.33 కి చేరుకుంది.


అదానీ స్టాక్స్
నిఫ్టీ50 ప్యాక్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ 13% పైగా లాభంతో ట్రేడవడం సహా, దలాల్ స్ట్రీట్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ శుక్రవారం గరిష్టంగా లాభపడ్డాయి. అదానీ గ్రూప్‌లోని 10 స్టాక్‌లలో 7 కౌంటర్లు 5% అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. US-ఆధారిత సంస్థ GQG పార్టనర్స్‌తో రూ. 15,000 కోట్ల ఒప్పందం తర్వాత, అదానీ గ్రూప్‌ మార్కెట్ క్యాప్ ఈరోజు దాదాపు రూ. 50,000 కోట్లు పెరిగింది.


బ్యాంక్ స్టాక్స్
ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో బ్యాంక్ స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ 2% పైగా పెరిగింది, నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 4.7% పెరిగింది. GQG డీల్ తర్వాత అదానీ స్టాక్స్‌లో బౌన్స్‌ను అవి కూడా అందిపుచ్చుకోవడంతో అప్ సైడ్‌ కదలిక వచ్చింది. GQG పార్టనర్స్‌ నుంచి సేకరించిన డబ్బుతో అదానీ గ్రూప్‌ అప్పులను తీరుస్తుందన్న వార్తలతో బ్యాంక్‌ స్టాక్స్‌ బలపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.