Anurag Thakur Fires on Rahul Gandhi: 



కేంబ్రిడ్జ్‌లో రాహుల్..


రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలందరిపైనా గుట్టుగా నిఘా పెడుతున్నారంటూ పెగాసస్‌ కేసుని ప్రస్తావించారు. దేశం అన్వయించుకోడానికి వీల్లేని విధానాలు బలవంతంగా రుద్దుతున్నారంటూ మండి పడ్డారు. పెగాసస్‌ గురించి చెబుతూ తన  ఫోన్‌లోనూ పెగాసస్ వైరస్ ఉందని, ఇదే విషయం అధికారులు చెప్పారని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"నిన్నటి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో రాహుల్ గాంధీకి ముందే తెలుసు. కాంగ్రెస్‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పెగాసస్ ఆయన ఫోన్‌లో కాదు. ఆయన మెదడులోనే ఉంది. బహుశా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఏం చెప్పిందో రాహుల్ విన్నట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాని మోదీని గౌరవిస్తున్నారని చెప్పారు. తన మొబైల్‌లో పెగాసస్ ఉందన్న అనుమానం ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు. విదేశాల్లోనే ఉన్న స్నేహితులతో  చేతులు కలిపి దేశ పరువుని దిగజార్చేలా మాట్లాడుతున్నారు"


అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించీ ప్రస్తావించారు అనురాగ్ ఠాకూర్. ప్రజలందరూ ప్రధాని మోదీని అభిమానిస్తున్నారని, అందుకే బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ సొంతమని అన్నారు. భారత మీడియాను కూడా రాహుల్ గాంధీ కించపరుస్తున్నారని మండి పడ్డారు. 


ఇదీ కేసు..


పెగాసస్‌ స్పైవేర్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది పెగాసస్‌ మాల్‌వేర్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చాలా స్పష్టంగా చెప్పింది. టెక్నికల్ టీమ్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. అదే సమయంలో కేంద్రం ఈ విచారణలో కమిటీకి సరిగా సహకరించలేదనీ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనిపైనే భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. "కేంద్రం కమిటీకి సహకరించలేదంటే, ఏదో నిజాన్ని దాస్తున్నట్టే కదా" అని ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటమే అంటూ ప్రధాని మోదీ, భాజపాపై మండిపడ్డారు. అటు భాజపా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తోందని, ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బ తీయాలని చూస్తోందని విమర్శిస్తోంది. సీనియర్ భాజపా నేత రవి శంకర్ ప్రసాద్...రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆ 5 మొబైల్స్‌లో ఏ మాల్‌వేర్ ఉందో తేలిన తరవాత, భాజపా ఈ పని చేసిందో లేదో కచ్చితంగా తెలుస్తుందని..అప్పుడు కాంగ్రెస్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని మండిపడ్డారు. 


Also Read: Elon Musk puja: అందరికీ ఫ్యాన్స్ ఉంటే మస్క్‌కు మాత్రం భక్తులుంటారు, ప్రూఫ్ కావాలా? ఈ వీడియో చూడండి