Bikanervala Kedarnath Aggarwal Dies: ప్రముఖ స్నాక్స్ & స్వీట్స్ బ్రాండ్ చైన్ బికనీర్‌వాలా వ్యవస్థాపకుడు లాలా కేదార్‌నాథ్ అగర్వాల్ ‍‌(Lala Kedarnath Aggarwal) సోమవారం మరణించారు. అందరూ 'కాకాజీ' ‍‌(Kakaji) అని పిలిచే అగర్వాల్‌ వయస్సు 86 సంవత్సరాలు. బికనీర్‌వాలా స్వీట్స్‌, స్నాక్స్‌ అంటే దక్షిణాదిలో పెద్దగా తెలీకపోవచ్చు గానీ, ఉత్తర భారతదేశంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. ఈ తినుబండారాలు అక్కడి ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయి.


బికనీర్‌వాలాను స్థాపించిన కేదార్‌నాథ్ అగర్వాల్‌ జీవితం సినిమా కథలా ఉంటుంది. 'కష్టే ఫలిః' అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం కాకాజీ. ఒకప్పుడు, పాత దిల్లీ వీధుల్లో భుజియా, రసగుల్లాలను బకెట్లలో విక్రయించిన లాలా కేదార్‌నాథ్ అగర్వాల్, అంచెలంచెలుగా ఎదిగి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. బిజినెస్‌ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వారు మాత్రమే కాదు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి చదవాల్సిన పాఠం 'కాకాజీ జీవిత చరిత్ర'.


దేశంలో 60కి పైగా బికనీర్‌వాలా ఔట్‌లెట్లు ‍‌(Over 60 Bikanervala outlets in India)
బికనీర్‌వాలా బ్రాండ్‌తో భారతదేశంలో 60కి పైగా ఔట్‌లెట్లు నడుస్తున్నాయి, ఫారిన్‌ కూడా విస్తరించాయి. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్, UAE ప్రజలు కూడా బికనీర్‌వాలా రుచులను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ మొత్తం ఔట్‌లెట్లలో ఏడాదికి దాదాపు 1300 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. 


దిల్లీకి వలస వచ్చిన కేదార్‌నాథ్ అగర్వాల్ ‍‌(Kedarnath Aggarwal migrated to Delhi)
కేదార్‌నాథ్ అగర్వాల్ వ్యాపార ప్రయాణం పాత దిల్లీలో ప్రారంభమైంది. 50వ దశకం ప్రారంభంలో, తన సోదరుడు సత్యనారాయణ్ అగర్వాల్‌తో కలిసి దిల్లీకి వలస వచ్చారు. సోదరులిద్దరూ పాత దిల్లీ వీధుల్లో తిరుగుతూ, బకెట్లలో భుజియా & రసగుల్లాలు అమ్మారు. అవి వాళ్ల ఫ్యామిలీ వంటకాలు, ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా వచ్చాయి. వాటిని ఇంట్లోనే తయారు చేసేవాళ్లు. అలా, తమ కుటుంబ వారసత్వాన్ని దిల్లీకి పరిచయం చేశారు.


కాళ్లకున్న చెప్పులు అరిగేలా తిరిగిన అగర్వాల్ సోదరుల కష్టానికి త్వరగానే గుర్తింపు వచ్చింది. భుజియా, రసగుల్లాల రుచికి దిల్లీ ప్రజలు దాసోహం అన్నారు. వాళ్లు తీసుకెళ్లే తినుబండారాలు త్వరగా అమ్ముడుపోయేవి. అక్కడి నుంచి వ్యాపారంలో మరో మెట్టు ఎక్కారు అగర్వాల్‌ సోదరులు. తిరుగుళ్లను కట్టిపెట్టి, దిల్లీ చాందినీ చౌక్‌లో మొదటి స్వీట్‌ షాప్‌ ప్రారంభించారు.


1905 నుంచి వ్యాపారంలో ఊపు
1905లో స్వీట్‌ షాప్‌ ప్రారంభమైంది, ఆ దుకాణం పేరు బికనీర్ నామ్‌కీన్ భండార్ (Bikaner Namkeen Bhandar). అందులో.. భుజియా, రసగుల్లాలతో పాటు మూంగ్ దాల్ హల్వా, కాజు కట్లీ, బికనేరి భుజియా, మరికొన్ని స్వీట్లు, హాట్లు అమ్మారు. దిల్లీ ప్రజలు మూంగ్ దాల్ హల్వా తినడం అదే తొలిసారి. ఆ స్వీట్‌తో పాటు కాజు కట్లీ, బికనేరి భుజియా కూడా బాగా ఫేమస్‌ అయ్యాయి. ఆ తర్వాత అగర్వాల్‌ సోదరులు & ఆ స్వీట్‌ షాప్‌ కూడా బికనీర్‌వాలా పేరుతో పాపులర్‌ అయ్యారు. అక్కడి నుంచి అగర్వాల్‌ సోదరులు వ్యాపారంలో ఎప్పుడూ వెనుకబడలేదు. 


2023లోకి వస్తే, దిల్లీలోని ప్రతి కుటుంబం సందర్శిస్తున్న స్వీట్‌ షాప్‌గా బికనీర్‌వాలా మారింది. పండగయినా, శుభకార్యమైనా.. బికనీర్‌వాలా స్వీట్స్, స్నాక్స్‌ ఇంట్లో తప్పనిసరిగా ఉండేలా పరిస్థితి మారింది. అయితే, రాత్రికి రాత్రే ఇదంతా జరగలేదు. అగర్వాల్ సోదరులు దిల్లీలోని గల్లీగల్లీ తిరిగి తినుబండారాలు అమ్మారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి షార్ట్‌ కట్స్‌ వెతుక్కోకుండా 'స్ట్రెయిట్‌ వే'లోనే వెళ్లారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లి, అతి పెద్ద సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్టించారు. 


మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial