Bears maul market again:   భారతీయ స్టాక్ మార్కెట్లు  శుక్రవారం బ్లడ్ బాత్‌కు గురయ్యాయి.  ఉదయం నుండే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బాంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ  సెన్సెక్స్ ఏకంగా 1,471 పాయింట్లు  పతనమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ  నిఫ్టీ సైతం 23,200 స్థాయి కంటే దిగువకు పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న బేరిష్ ట్రెండ్ నేడు పరాకాష్టకు చేరినట్లు కనిపిస్తోంది.

Continues below advertisement

ఈ భారీ పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమయ్యాయి. ముఖ్యంగా  పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు , ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీని ప్రభావంతో ముడిచమురు ధరలు  మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడం ఇండియా వంటి దిగుమతి ఆధారిత దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరల భయంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లడం అమ్మకాలకు దారితీసింది.

మరోవైపు, దేశీయంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిరంతరంగా షేర్లను విక్రయించడం కూడా మార్కెట్‌ను బలహీనపరిచింది. భారత రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోవడం, యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి పెరగడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ,   మెటల్ రంగానికి చెందిన దిగ్గజ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా దెబ్బతిన్నాయి. పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు వరుసగా మూడవ సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేశాయి.  

Continues below advertisement

నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి దాదాపు రూ. 16 లక్షల కోట్ల  ఇన్వెస్టర్ల సంపద ఆవిరి కావడం ఈ పతనం తీవ్రతను తెలియజేస్తోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధ వాతావరణం సద్దుమణిగి, చమురు ధరలు స్థిరపడే వరకు ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. వారాంతపు ముగింపు ఇంత ఘోరంగా ఉండటంతో, వచ్చే వారం కూడా బేర్స్ పట్టు కొనసాగవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.