Apple Stores In India: భారతదేశంలో ఆపిల్‌ మొట్టమొదటి రిటైల్‌ స్టోర్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఈ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ, ముంబయిలో లీజుకు తీసుకున్న భవనంలో తొలి స్టోర్‌ను ఈ నెల 18న ప్రారంభించనుంది. ముంబయిలోని ఖరీదైన బంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్‌లో ఈ రిటైల్‌ స్టోర్‌ ఉంది. తొలి రోజు నుంచే ఈ స్టోర్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ స్టోర్‌ను యాపిల్‌ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు.


ఈ నెల 18న (వచ్చే మంగళవారం) ముంబై స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత, 20వ తేదీన దిల్లీలోనూ మరో స్టోర్‌ను ప్రారంభిస్తామని ఆపిల్ ప్రకటించింది.


టిమ్‌ కుక్ హాజరయ్యే అవకాశం
భారతదేశ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానిలో అవుట్‌లెట్‌ల ప్రారంభోత్సవానికి యాపిల్‌ CEO టిమ్‌ కుక్ (Apple CEO Tim Cook) హాజరయ్యే అవకాశం ఉంది. టిమ్‌ కుక్, ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఆపిల్ స్టోర్‌కు రిబ్బన్‌ కట్‌ చేసిన తర్వాత దిల్లీ చేరుకుంటారు. దిల్లీ సాకేత్ ప్రాంతంలోని హై-ఎండ్ మాల్‌ ఏర్పాటు చేసిన ఆపిల్‌ స్టోర్‌ తలుపులు అన్‌లాక్ చేస్తారు. ఈ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌గా (Apple Saket) పిలుస్తున్నారు. 


రిటైల్‌ స్టోర్ల ఓపెనింగ్‌ కోసం టిమ్‌ కుక్‌ వస్తున్నారన్న వార్తలను బట్టి.. ఐఫోన్లు సహా ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ ఉత్పత్తి, మార్కెటింగ్‌ విషయంలో భారత మార్కెట్‌కు ఆ గ్లోబల్‌ కంపెనీ ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, టిమ్‌ కుక్‌ పర్యటనను యాపిల్‌ ఇంకా అధికారంగా ప్రకటించలేదు.


చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలు
2016లో ఆపిల్‌ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత ఈ పర్యటన వస్తోంది. భారతదేశ ఐఫోన్‌ల విక్రయాలు ఆల్ టైమ్ హైకి చేరాయి, మన దేశం నుంచి వార్షిక ఐఫోన్ ఎగుమతి బిలియన్ డాలర్లకు చేరుకుంది. బీజింగ్‌-వాషింగ్‌టన్‌ మధ్య సంబంధాలు చెడడంతో, చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆపిల్‌ కంపెనీ భారత్‌ వైపు చూస్తోంది.


వాస్తవానికి, ఈ రెండు స్టోర్లను చాలా కాలం క్రితమే ఓపెన్‌ చేయాల్సి ఉంది. దేశీయ అమ్మకాల్లో ఎక్కువ మొత్తాన్ని దేశీయంగా తయారు చేయని గ్లోబల్ కంపెనీలు తమ సొంత బ్రాండ్ అవుట్‌లెట్‌లను మన దేశంలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నియమాలు విధించింది. దీంతో ఈ రెండు స్టోర్లు చాలా కాలంగా పెండింగ్‌ ఉన్నాయి. దేశీయంగా ఇప్పటి వరకు ఫిజికల్‌ స్టోర్‌ను ప్రారంభించలేకపోయినా, ఇండియన్‌ ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లోనే ఆపిల్‌ ప్రారంభించింది. 


మన దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి. అయితే, ఆపిల్ ఉత్పత్తుల అధిక ధరలు ఇప్పటికీ ఆ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. 


ప్రధాని మోదీతో భేటీ కోసం ప్రయత్నాలు
ముంబయి, దిల్లీ స్టోర్ ప్రారంభోత్సవాల మధ్య ఉన్న గ్యాప్‌లో, ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్‌ కుక్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధాని అప్పాయింట్‌మెంట్‌ కూడా అడిగారట. భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ఈ విభాగంలోకి వచ్చే కంపెనీలను తెగ ప్రోత్సహిస్తోంది. ఆపిల్‌ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్‌ (Foxconn Technology Group), పెగాట్రాన్‌ (Pegatron Corp) కోసం బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించింది.


యాపిల్ ఎర్నింగ్స్ కాల్స్‌లోనూ భారత మార్కెట్, ఉత్పత్తి కేంద్రంగా భారతదేశ ప్రాముఖ్యత గురించి కుక్ ప్రస్తావించారు. త్రైమాసిక ఆదాయ రికార్డును భారత్‌ నెలకొల్పింది, గత సంవత్సరం కంటే బలమైన రెండంకెల వృద్ధిని సాధించింది అని అన్నారు. భారతదేశం మాకు అత్యంత ఉత్తేజకరమైన మార్కెట్, మా ప్రధాన దృష్టి దానిపైనే అని కుక్‌ చెప్పారు. "నేను భారత్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నాను" అని కూడా వ్యాఖ్యానించారు.