Adani Enterprises FPO: 


స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంటు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises FPO) ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సూపర్‌ హిట్టైంది! ఇష్యూ మూడో రోజు పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు నుంచి విపరీతంగా మద్దతు లభించింది. రూ.20,000 కోట్లతో కంపెనీ ఎఫ్‌పీవోకు వస్తున్న సంగతి తెలిసిందే.


మంగళవారం సాయంత్రం 3:45 గంటలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవోకు 5,01,12,652 షేర్లకు బిడ్లు వచ్చాయి. కంపెనీ ఇష్యూ చేస్తున్న 4,55,06,791 షేర్ల కన్నా 11 శాతం అధికంగా రావడం గమనార్హం. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎఫ్‌పీవోపై ఎక్కువ ఆసక్తి కనబరచలేదు.  వారికి కేటాయించిన షేర్లకు కేవలం 11 శాతమే బిడ్లు వచ్చాయి. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 3.26 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయర్స్‌ విభాగం 126 శాతం సబ్‌స్క్రైబ్‌ అయింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు నేడు 2.8 శాతం లాభపడింది. రూ.2,975 వద్ద ముగిసింది. ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ.3112-3276తో పోలిస్తే మార్కెట్‌ ధరే తక్కువగా ఉంది. ఎఫ్ఈవోకు దరఖాస్తు చేసుకున్నవారు మొదట 50 శాతం డబ్బు చెల్లించాలి. మిగతా మొత్తం విడతల వారీగా చెల్లించాలి. రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.64 వరకు రాయితీ ఇస్తున్నారు.


ఐహెచ్‌సీ ఆసక్తి


అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO)లో పాల్గొంటామని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ కంపెనీ (IHC) సోమవారం తెలిపింది. ఎఫ్ఈవోలో 400 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెడతామని ప్రకటించింది. తమ సబ్సిడరీ కంపెనీ గ్రీన్‌ ట్రాన్స్‌మిషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ ద్వారా దీనిని చేపడతామని వెల్లడించింది.


'అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఫండమెంటల్స్‌పై మాకు విశ్వాసం ఉంది. అదానీ గ్రూప్‌పై ఆసక్తి కలగడానికి ఇదే కారణం. దీర్ఘకాల దృక్పథంతో గమనిస్తే కంపెనీ వృద్ధికి ఎంతో ఆస్కారం ఉంది. ఇది మా వాటాదారుల విలువను పెంచుతుంది' అని ఐహెచ్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ బసర్‌ షుయెబ్‌ అన్నారు.


2.5 బిలియన్‌ డాలర్ల విలువైన అదానీ ఎఫ్‌పీవోలో ఐహెచ్‌సీ పెట్టుబడి 16 శాతంగా ఉంది. 'మేం పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆదాయ నివేదిక, యాజమాన్యం, వ్యాపారం తీరు వంటి విస్తృతమైన సమాచారాన్ని మేం శోధించాం. ఈ ఎఫ్‌పీవోను ఒక చారిత్రక రిఫరెన్స్‌ను తీసుకున్నాం' అని సయ్యద్‌ వెల్లడించారు.


అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆవిరవుతున్న తరుణంలో ఐహెచ్‌సీ పెట్టుబడులు పెడతామంటూ ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యగానికి గురి చేసింది. తొలి రెండు రోజుల్లో కంపెనీ ఎఫ్‌వోకు 3 శాతమే దరఖాస్తులు రావడం గమనార్హం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.