99 Percent Of New Central Ministers Are Crorepatis: భారతదేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త మంత్రులు బాధ్యతలు కూడా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వ 100 రోజుల ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో వాళ్లంతా ఇప్పుడు బిజీగా ఉన్నారు. 


దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న 'అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR) రిపోర్ట్‌ ప్రకారం... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో ఉన్న 71 మంది సభ్యుల్లో 70 మంది మిలియనీర్లు. వాళ్ల సగటు సంపద విలువ రూ.100 కోట్ల పైమాటే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఒక్కొక్కరి సగటు సంపద రూ.107.94 కోట్లు. అంతేకాదు... రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న మంత్రులు ఆరుగురు ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో వాళ్లు ప్రకటించిన ఆస్తుల వివరాల ఆధారంగా ఏడీఆర్ ఈ అంచనా వేసింది.


ఈ 71 మంది మంత్రుల్లో 70 మంది మిలియనీర్‌ కేటగిరీలో ఆస్తులు ప్రకటించారు. అంటే... మోదీ 3.0 క్యాబినెట్‌ సభ్యుల్లో 99 శాతం మంది కోటీశ్వరులే. 


అత్యంత ధనవంతుడు తెలుగు వ్యక్తి - దాదాపు రూ.5,700 కోట్లు
మోదీ 3.0 మంత్రులందరిలోనూ అత్యంత ధనవంతుడు తెలుగు వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. TDP తరపున గుంటూరు ఎంపీగా గెలిచారు. గెలిచిన మొదటిసారే కేంద్ర క్యాబినెట్‌లో బెర్త్‌ సంపాదించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రిగా పదవి దక్కించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ రూ.5705.47 కోట్లు. ఈ ఆస్తుల్లో రూ.5598.65 కోట్ల విలువైన చరాస్తులు, రూ.106.82 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.


రెండో స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా
కమ్యూనికేషన్స్‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.424.75 కోట్లు. ఆయన సంపదలో రూ.62.57 కోట్ల చరాస్తులు, రూ.362.17 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.


మూడో స్థానంలో HD కుమారస్వామి
జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన HD కుమారస్వామికి భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ దక్కింది. కుమారస్వామి ఆస్తుల విలువ రూ.217.23 కోట్లు. ఇందులో... రూ. 102.24 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 115.00 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.


నాలుగో స్థానంలో అశ్విని వైష్ణవ్
రైల్వే, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మొత్తం ఆస్తుల విలువ రూ.144.12 కోట్లు. ఇందులో... రూ.142.40 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1.72 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.


ఐదో స్థానంలో రావ్ ఇంద్రజిత్ సింగ్
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రణాళిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ.121.54 కోట్లు. ఆయన ఆస్తుల్లో రూ.39.31 కోట్ల చరాస్తులు, రూ.82.23 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.


ఆరో స్థానంలో పీయూష్ గోయల్
వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రూ.110.95 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఇందులో రూ.89.87 కోట్ల విలువైన చరాస్తులు, రూ.21.09 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.


ప్రధాని నరేంద్ర మోదీ 71 మంది మంత్రులు, సహాయ మంత్రులతో ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఐదుగురు సహాయ మంత్రులది స్వతంత్ర హోదా. విశేషం ఏంటంటే... ఈ 71 మందిలో 11 మంది కేవలం 12వ తరగతి వరకే చదివారు. 57 మంది (80%) డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత చదువులు చదివారు.


మరో ఆసక్తిర కథనం: పెన్షన్ల విధానంలో మార్పు, 'ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌' వైపు మొగ్గు - 'బేసిక్‌ పే'లో 50 శాతం గ్యారెంటీ!