భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం రోజు రోజుకు పెరుగుతున్నది.  పెట్రో ధరల పెరుగుదల ఇబ్బందులతో పాటు, కాలుష్య రహిత ప్రయాణం పట్ల జనాల్లో అవగాహన పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పట్ల మొగ్గు చూపుతున్నారు. అయితే, పెట్రో వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఛార్జింగ్ నెట్ వర్క్ ఇంకా పుంజుకోలేదు. విస్తృతంగా లేని ఛార్జింగ్ నెట్‌వర్క్ పెద్ద అడ్డంకిగా మారింది.  అయినా, ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లు సుదీర్ఘ ప్రయాణ పరిధిని అందిస్తుండటంతో అమ్మకాలు భారీగానే జరుగుతున్నాయి. ఖరీదు కాస్త ఎక్కువ అయినా, ఛార్జింగ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. గత నెలలో భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల సంఖ్య భారీగా నమోదయ్యింది. ఇంతకీ ఏ కంపెనీ కార్లు ఎన్ని యూనిట్లు అమ్ముడు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..


ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో తిరుగులేని టాటా


ఈ సంవత్సరం సెప్టెంబరులో, క్యుములేటివ్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 3,419 యూనిట్లుగా ఉన్నాయి. గతంతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో 172 శాతం వృద్ధిని సూచిస్తుంది. అయితే MoM ప్రాతిపదికన ఈ వృద్ధి 5.62 శాతంగా ఉంది. EV అడాప్షన్‌లో పెరుగుదల క్రమంగా గ్రోత్ కనిపిస్తున్నది.  అమ్మకాల గణాంకాల ప్రకారం, టాటా మోటార్స్ నెక్సాన్ EV,  టిగోర్ EVలు అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో నిలిచాయి.  పూర్తిగా స్వదేశీ బ్రాండ్ అయిన టాటా కంపెనీ గత నెలలో 2,831 యూనిట్లను విక్రయించింది.  ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 893 యూనిట్లతో పోల్చితే చాలా ఎక్కువ. సుమారు 217 శాతం వృద్ధిని సాధించింది. ఈ జాబితాలో తదుపరిది ZS EV. ఇది 280 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది.ఇక మహీంద్రా కంపెనీ అమ్మకాల లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. మహీంద్రా eVerito  112 యూనిట్ల అమ్మకాలతో మూడో ప్లేస్ దక్కించుకుంది.  గత ఏడాది సెప్టెంబర్‌లో,  ఈ కంపెనీ కేవలం  19 ఎలక్ట్రిక్ యూనిట్లను మాత్రమే అమ్మింది.  హ్యుందాయ్ కోనా Ev 74 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, దేశంలోని ఏకైక ఎలక్ట్రిక్ MPV - BYD e6  63 యూనిట్లను అమ్మింది.


Read Also: వారెవ్వా, ఓలా ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ అదుర్స్ - ఎప్పుడు లాంచ్ కానుందో తెలుసా?


వేగం పుంజుకుంటున్నప్రీమియం సెగ్మెంట్


ఎలక్ట్రిక్ వాహనాలు  ప్రీమియం విభాగంలోనూ కొంత వేగం పుంజుకుంటున్నాయి. పోర్స్చే టైకాన్ గత నెలలో 13 యూనిట్లను అమ్మింది.   అయితే, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో BMW 27 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గమ్మతైన విషయం ఏంటంటే,  గత నెలలో దేశంలో జాగ్వార్ ఐపేస్ కేవలం ఒకే ఒక్క యూనిట్ ను అమ్మింది.  మొత్తంగా టాటా కంపెనీని ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో బీట్ చేసే ప్రత్యర్థి సమీపంలో కనిపించకపోవడం విశేషం.