ODI World Cup 2025 Winner | భారత జట్టు కోసం టాటా మోటార్స్ ఇటీవల ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. 2025 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి టాటా సియెర్రా SUV ని బహుమతిగా ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శన, చారిత్రాత్మక విజయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో టాటా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది. Tata Sierra SUV కారు ఇంజిన్, ఫీచర్లు, సేఫ్టీ, డిజైన్ గురించి ఇప్పుడు చూద్దాం.
నవంబర్ 25న కొత్త టాటా సియెర్రా మార్కెట్లోకి
టాటా మోటార్స్ తన ఐకానిక్ SUV టాటా సియెర్రాను నవంబర్ 25న విడుదల చేయనుంది. ఇది కంపెనీ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత అధునాతన, లగ్జరీ SUVగా మారనుంది. ఇందులో కొత్త మోడ్రన్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అనేక హైటెక్ ఫీచర్లు ఉంటాయి. కొత్త సియెర్రాలో 3 డిజిటల్ స్క్రీన్లు, సౌకర్యవంతమైన సీట్లు, అనేక స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. ఇవి మీ వాహనం డ్రైవింగ్ను సులభతరం చేస్తాయి. టాటా సిమెర్రా SUV సౌకర్యం, కస్టమర్లకు అనుకూలత రెండింటినీ దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు టాటా మోటార్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
లగ్జరీ డిజైన్, అధునాతన ఫీచర్లు
కొత్త టాటా సియెర్రాను స్టైలిష్గా, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో 3 స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి డ్రైవర్ కోసం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండోది ఇన్ఫోటైన్మెంట్ కోసం మధ్యలో, ఇక మూడవది ప్రయాణీకుల ముందు అమర్చి ఉంటాయి. ఈ SUVలో పనోరమిక్ సన్రూఫ్, LED హెడ్లైట్లు, JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఈ టాటా సియెర్రా బయటి డిజైన్ చాలా మోడ్రన్గా, చెప్పాలంటే ప్రీమియంగా ఉంటుంది. ఇది రోడ్డుపై వెళ్తుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కనెక్టివిటీ సహా సేఫ్టీ ఫీచర్లు
టాటా సియెర్రా SUVలో 540 డిగ్రీ కెమెరా వ్యూ, వైర్లెస్ Android Auto, యాపిల్ Apple CarPlay సహా వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ (Wireless Charging) వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, SUVలో లెవెల్ 2 ADAS సిస్టమ్, ABS, EBD, ESC, హిల్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేయడానికి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) సైతం ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇండియా టీం క్రీడాకారిణికి టాప్ మోడల్ గిఫ్ట్
టాటా మోటార్స్ వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి టాటా సియెర్రా టాప్-ఎండ్ వేరియంట్ను బహుమతిగా ఇవ్వనుంది. భారత జట్టులో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ్ రానా, రేణుకా సింగ్, రాధా యాదవ్ వంటి స్టార్ క్రీడాకారిణులు ఉన్నారు. భారత జట్టు ఇటీవల జరిగిన ఫైనల్లో దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. తొలిసారి భారత్ వన్డే వరల్డ్ కప్ ముద్దాడింది. అమ్మాయిలు దేశం గర్వించేలా చేశారు.