Supreme Court On Vehicle Insurance:దేశవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో సగానికిపైగా బీమా లేనివన్న చేదు నిజంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం విషయంలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టేందుకు విప్లవాత్మక మార్పులకు తెరలేపింది. వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా పత్రం లేకపోతే, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించింది.
అసలు ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చింది?
దేశంలో ఏటా సగటున 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లేదా క్షతగాత్రులకు దక్కాల్సిన బీమా పరిహారం వారి కుటుంబాలకు లేదా క్షతగాత్రులకు దక్కడం లేదు. కొన్నిసార్లు బీమా పరిహారం అందడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం సదరు వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడమేనని కోర్టు గుర్తించింది.
గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో మొత్తం 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉండగా, అందులో ఏకంగా 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదు. దీనిపై ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంటే రోడ్లపై తిరుగుతున్న ప్రతి వంద వాహనాల్లో 56 వాహనాలకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదని ఆశ్చర్యపోయింది. దీన్ని అరికట్టాలంటే పెట్రోల్ బంకుల వద్దే కఠిన రూల్స్ అమలు చేయాలని కోర్టు భావిస్తోంది.
తెలంగాణలో 30 ఏళ్ల క్రితం నాటి కేసు విచారణ
ఈ కీలక పరిణామాలకు తెలంగాణకు చెందిన 1996 నాటి ఒక రోడ్డు ప్రమాద కేసు ప్రాతిపదికగా నిలిచింది. 1996 జులైలో జరిగిన ఒక ప్రమాదంలో వ్యక్తి మరణించగా, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే వాహన యజమానికి వ్యక్తిగత రిస్క్ కవర్ లేదని పేర్కొంటూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ, బాధితులకు 7.5 శాతం వడ్డీతో కలిపి 10,00,500 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. క్లెయిమ్ల విషయంలో కోర్టులు అతి సాంకేతిక అంశాలను పట్టుకొని వేలాడవద్దని హితవు పలికింది.ి ఈ కేసు విచారణ సందర్భంగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ ఇన్సూర్డ్ వాహనాల అంశాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించి ఈ ప్రతిపాదనలు చేసింది.
అమలు ఎలా ఉండాలి?
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కేవలం ప్రతిపాదనలు చేయడమే కాకుండా, వాటిని అమలు చేసేందుకు అవసరమైన మార్పులను కూడా సూచించింది.
చెల్లుబాటు అయ్యే బీమా లేని వాహనాలకు ఫ్యూయల్ ఫిల్ చేయకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని కేంద్రానికి తెలిపింది. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వ వాహన్ డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అటాచ్ చేయాలని ఆదేశించింది. దీని వల్ల వాహన నెంబర్ ప్లేట్ స్కాన్ చేయగానే దాని బీమా స్టాటస్ తెలిసిపోతుంది.
బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే వార్షిక ప్రీమియంకు మూడు రెట్లు లేదా ఐదు వేల జరిమానా విధించాలని సూచించింది. రెండోసారి పట్టుబడితే ఆ ప్రీమియంకు ఐదు రెట్లు లేదా పదివేల ఫైన్ వేయాలని ప్రతిపాదించింది.కొత్త కార్లకు థర్డ్ పార్టీ బీమా గడువును మూడు ఏళ్ల నుంచి నాలుగు ఏళ్లకు, కొత్త టూవీలర్లకు ఐదేళ్ల నుంచి ఆరు ఏళ్లకు పెంచాలని ఐఆర్డీఏఐని ఆదేశించింది.
సుప్రీంకోర్టు చేసిన ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తే, మోటారు వాహన రంగంలో పెను మార్పులు రానున్నాయి. బీమా ఉంటేనే పెట్రోల్ దొరుకుతుందనే రూల్ వస్తే, వాహన యజమానులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇది రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, రోడ్డు భద్రతా రూల్స్పై ప్రజల్లో అవగాహన పెంచుతుంది.
