PM E-Drive Schemes: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈవీల వాడకం పెరగాలంటే పటిష్టమైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యవసరం. ఈ లోటు భర్తీ చేస్తూనే, సామాన్యులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పట్టాలెక్కించింది.
పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏంటీ?
పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్వర్క్ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం. ఈ స్కీమ్ ద్వారా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో ప్రధాన భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు తక్కువ రిస్క్తో ఈ వ్యాపారంలోకి ప్రవేశించే వీలు కలుగుతుంది.
సబ్సిడీ వివరాలు ఏంటీ?
ఈ పథకం కింద సబ్సిడీ శాతాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి విభజించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాలనీలు, ఆసుపత్రుల, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల పరికరాల కోసం కేంద్ర వంద శాతం సబ్సిడీని అందిస్తుంది.
అధిక రద్దీ ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, టోల్ ప్లాజాల సమీపంలో సెటప్ చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 80శాతం, పరికరాలపై 70శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి మౌలిక సదుపాయాల కోసం 80 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది.
పెట్టుబడి ఎంత? ఆదాయం ఎలా ఉంటుంది?
సాధారణంగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి పది నుంచి 15లక్షల వరకు ఖర్చు అవుతుంది. పీఎం ఈడ్రైవ్ పథకం ద్వారా మీరు 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని వల్ల జేబు నుంచి పెట్టాల్సిన పెట్టుబడి 2 నుంచి మూడు లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రాథమికంగా మొత్తం ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
ఆదాయం ప్రధానంగా యూనిట్ల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ ఛార్జింగ్కు సగటున రూ.15 నుంచి 20 వరకు వసూలు చేస్తున్నారు. ఒక సాధారణ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జింగ్ కోసం 30 నుంచి 45 యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. రోజుకు సుమారు 20 కార్లు మీ స్టేషన్కు వస్తే, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు తీసివేస్తే మిగిలిందే మీకు ఆదాయం.
ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పథకంలో దరఖాస్తు ప్రక్రియ నేరుగా సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఇది ఓ పద్ధతిలో జరుగుతుంది. సామాన్య ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్లో దరఖాస్తు చేసుకోలేరు. కేవలం ప్రబుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్లో రిజిస్టర్ చేసే అధికారం కలిగి ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత స్థలంలో లేదా వాణిజ్య స్థలంలో స్టేషన్ ప్రారంభించాలనుకుంటే వారు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లుగా మారి, పైన పేర్కొన్న నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు లేదా కమర్షియల్ స్థలం ఏదైనా అనుమతి ఉంటుంది. కానీ అది వ్యూహాత్మకంగా వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, నోడల్ ఏజెన్సీల వివరాల కోసం ప్రభుత్వ అధికార వెబ్సైట్ pmed.gov.ingను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు,కొత్త వ్యాపార మార్గాల కోసం చూస్తున్న వారికి ఈ పథకం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.
