Car Bike Insurance Renewal: చాలామంది వాహన యజమానులు మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చౌకైన పాలసీని ఎంచుకోవడం లేదా రెన్యూవల్ను కొంతకాలం వాయిదా వేయడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా డబ్బు ఆదా అయినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని బీమా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాలసీ గడువు ముగిసేలోపు రెన్యూవల్ చేయడం వల్ల లభించే ప్రయోజనాలు కోల్పోతే వేల రూపాయల వరకు అదనపు ఖర్చు వచ్చిపడే ప్రమాదం ఉంది.
ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా వేలాది మంది వాహన యజమానులు తమ మోటార్ ఇన్సూరెన్స్ను సకాలంలో రెన్యూవల్ చేయడం మరిచిపోతున్నారు. కొంతకాలం ఆలస్యంగా తీసుకుంటే డబ్బు ఆదా అవుతుందని భావిస్తారు. కానీ వాస్తవానికి వారు ఎన్నో ఏళ్లుగా క్లెయిమ్ చేయకుండా సంపాదించుకున్న ప్రయోజనాలను కోల్పోవడంతో పాటు కొత్త ఖర్చులను కూడా భరించాల్సి వస్తుంది.
భారత్లో ఇప్పటికే బీమా లేని వాహనాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. పార్లమెంట్లో ఇటీవల వెల్లడైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలోని యాక్టివ్ వాహనాల్లో సుమారు 44 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేదు. చట్టం ప్రకారం థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కియా సైరోస్ రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ - మాన్యువల్ది పైచేయా? DCT గెలిచిందా?
ఆర్థికంగా చాలా నష్టంఇన్సూరెన్స్ రెన్యూవల్ ఆలస్యం వల్ల మొదట నష్టపోయేది నో క్లెయిమ్ బోనస్ (No Claim Bonus). ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి క్లెయిమ్ చేయకుండా వాహనం నడిపిన వారికి బీమా సంస్థలు ఈ బోనస్ను అందిస్తాయి. మొదటి ఏడాది 20 శాతం నుంచి ప్రారంభమయ్యే ఈ రాయితీ వరుసగా ఐదేళ్లు క్లెయిమ్ చేయకపోతే 50 శాతం వరకు పెరుగుతుంది. అయితే సమగ్ర బీమా పాలసీ గడువు ముగిసి 90 రోజులకు పైగా రెన్యూవల్ చేయకపోతే ఈ No Claim Bonus పూర్తిగా రద్దవుతుంది. దీంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. అంటే, రాయితీ లేకుండా పూర్తి డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
పాలసీ గడువు ముగిసిన తర్వాత కొత్త పాలసీ తీసుకునే ముందు చాలా బీమా సంస్థలు వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేస్తాయి. దీనిని బ్రేక్ ఇన్ పాలసీ ప్రక్రియగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియ వల్ల పాలసీ జారీ ఆలస్యం కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో అధిక ప్రీమియం కూడా చెల్లించాల్సి రావచ్చు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపే సమయంలో ప్రమాదం జరిగితే మొత్తం ఖర్చును వాహన యజమానే భరించాల్సి ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం... తక్కువ ధర ఉన్న పాలసీని కొనడం మాత్రమే డబ్బు ఆదా చేసే మార్గం కాదు. సరైన కవరేజ్ను ఎంచుకోవడం, పాలసీని సకాలంలో రెన్యూవల్ చేయడం, ప్రీమియంతో పాటు ప్రయోజనాలను కూడా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. పెరుగుతున్న వాహన మరమ్మతుల ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే మోటార్ ఇన్సూరెన్స్ను కేవలం చట్టపరమైన నిబంధనగా కాకుండా ఆర్థిక రక్షణగా చూడాలన్నది ఎక్స్పర్ట్ల సూచన.
ఇది కూడా చదవండి: 526km రేంజ్తో కియా సైరోస్ EV ఎంట్రీ - టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EVతో పోలిస్తే ప్రత్యేకత ఏంటి?
ముందున్న టూవీలర్ యజమానులుకొన్ని స్టడీల ప్రకారం, ప్రతి ఎనిమిది మంది మోటార్ ఇన్సూరెన్స్ యూజనర్లలో ఒకరు ప్రతి ఏడాది పాలసీని మార్చడం లేదా గడువు ముగిసిపోయేదాకా ఆగడం చేస్తున్నారు. ముఖ్యంగా టూవీలర్ యజమానుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. బీమాను కేవలం ట్రాఫిక్ నిబంధనల కోసం మాత్రమే తీసుకుంటున్నారని, దీర్ఘకాలిక ఆర్థిక రక్షణగా భావించడం లేదని అధ్యయనంలో తేలింది.
నిపుణుల సూచన ప్రకారం, పాలసీ గడువు ముగిసే చివరి రోజు వరకు వేచి ఉండకుండా కొన్ని రోజుల ముందుగానే వివిధ బీమా సంస్థల పాలసీలను పోల్చి చూడాలి. Insured Declared Value (IDV)ని పరిశీలించి, జీరో డిప్రిసియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ వంటి అదనపు కవర్లు నిజంగా అవసరమా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. వీటి వల్ల ప్రీమియం కొద్దిగా పెరిగినా ప్రమాదం జరిగినప్పుడు జేబు నుంచి చెల్లించాల్సిన ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
IRDAI నిబంధనల ప్రకారం వార్షిక మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఉండదు. ఒక్క రోజు గడువు దాటినా వాహన తనిఖీ అవసరం కావచ్చు. రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మోటార్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ట్రాఫిక్ జరిమానాలను తప్పించుకునేందుకు మాత్రమే కాదు, పెద్ద ఆర్థిక నష్టాల నుంచి రక్షణ కల్పించే భద్రతా కవచం కూడా. అందుకే పాలసీని సకాలంలో రెన్యూవల్ చేయడం, No Claim Bonusను కాపాడుకోవడం & అవసరమైన కవరేజ్ను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
