మారుతి సుజుకి మనదేశంలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హరియాణాలో ఈ కొత్త ప్లాంట్‌ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇది హరియాణాలో మూడో మారుతి సుజుకి ప్లాంట్ కానుంది. ఇది హరియాణాలో కంపెనీకి అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్. దాదాపు రూ.20 వేలకు పైగా పెట్టుబడులను కంపెనీ పెట్టనుందని అంచనా. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయింది. దీంతో ఖర్కొండాలో 900 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మారుతి సుజుకికి అందించనుంది.


ఖర్కొండాలోని సోనిపట్‌లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు పెట్టడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు 13 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో ల్యాండ్ కొనుగోలుకు రూ.2,400 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.


2025 నాటికి ప్రతి యేటా 2.5 లక్షల కార్లను రూపొందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాలు గడిచేసరికి ప్రతి యేటా 10 లక్షల యూనిట్లను తయారు చేస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.


మారుతి తన మొట్టమొదటి ప్రొడక్షన్ ఫెసిలిటీని 1983లో గురుగ్రామ్‌లో ప్రారంభించింది. మెల్లగా తన వ్యాపారాన్ని విస్తరిస్తుంది. ఈ కొత్త ప్లాంట్‌లో ప్రస్తుతం మారుతి పోర్ట్‌ఫోలియోలో ఉన్న కార్లతో పాటు పెట్రోల్, సీఎన్‌జీ కార్లను తయారు చేయనున్నారు. కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో 2025 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను తయారు చేయనున్నాయి.


కొత్త బలెనో, ఎర్టిగా, ఎక్స్ఎల్6, వాగర్ ఆర్ వాటిని లాంచ్ చేయడం ద్వారా మారుతి తన కొత్త ఉత్పత్తులను కూడా క్రమంగా పెంచుకుంది. వీటితో పాటు కొత్త తరం సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజా కూడా త్వరలో లాంచ్ కానుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?