Subsidy on EVs: భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ వెహికల్స్ కోసం ఫేమ్-II సబ్సిడీ కోసం కేటాయించిన మొత్తాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వెచ్చించిన మొత్తాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.11,500 కోట్లకు పెంచారు. అంటే ఇప్పుడు సబ్సిడీ నేరుగా రూ.1,500 కోట్లు పెరిగిందన్న మాట.


ఫేమ్-II సబ్సిడీ ఇలా...
2024 మార్చి 31వ తేదీ నాటికి లేదా ఫండ్ ముగిసే వరకు విక్రయించే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ పెరిగిన నిధులు దేశంలో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నాయి. ఈ పథకం "ఫండ్ అండ్ టర్మ్ లిమిటెడ్" ఆధారంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


2024 మార్చి 31వ తేదీ వరకు విక్రయించే ఎలక్ట్రిక్ టూ వీలర్‌లు, త్రీ వీలర్‌లు, ఫోర్ వీలర్‌లపై డిమాండ్ ప్రమోషన్ కోసం సబ్సిడీ వర్తిస్తుంది. లేదా అదనంగా కేటాయించిన నిధులు ముగిసే వరకు ఏది ముందుగా ఉంటే అది వర్తిస్తుంది. సవరించిన వ్యయంలో వాహన సబ్సిడీకి రూ.7,048 కోట్లు, క్యాపిటల్ అసెట్ క్రియేషన్ గ్రాంట్ కోసం రూ.4,048 కోట్లు, ఇతరులకు రూ.400 కోట్లు ఉన్నాయి.


ఫేమ్ II పథకం ప్రారంభంలో 2022 వరకు మూడు సంవత్సరాలకు రూ. 10,000 కోట్లు కేటాయించారు. తరువాత 2024 మార్చి వరకు పొడిగించారు. దీని ప్రధాన లక్ష్యం 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 55,000 ప్యాసింజర్ కార్లు, 7,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించడం.


ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం అమ్మకాలు 2023లో విపరీతంగా పెరిగాయి. 2022లో 1.02 మిలియన్లతో పోలిస్తే 2023లో 1.53 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఈవీ కొనుగోళ్లలో పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఈ పెరుగుదల స్థిరమైన రవాణా ఎంపికగా ఈవీలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది.


మరోవైపు భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో భారత దేశంలో కొన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024లో మొదటిగా లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇది కాకుండా వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా రాబోయే కాలంలో మార్కెట్లోకి రానుంది. ఈ కారు ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ 2024 సంవత్సరాన్ని అప్‌డేట్ చేసిన క్రెటాతో ప్రారంభించింది. దీని తరువాత హ్యుందాయ్ 2024 సంవత్సరం మధ్య నాటికి క్రెటా ఎన్ లైన్, అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లను పరిచయం చేస్తుంది. కొత్త తరం మారుతి స్విఫ్ట్ ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానుందని సమాచారం. ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో మెరుగైన డిజైన్, ఇంటీరియర్‌ను కూడా పొందుతుంది. కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి రానుంది. ఈ కారు గరిష్టంగా 82 బీహెచ్‌పీ పవర్‌ని, 108 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది. కొత్త తరం మారుతి డిజైర్‌లో కూడా ఇదే ఇంజిన్ అందుబాటులో ఉంటుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!