Nitin Gadkari approves E100 fuel: భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో 100 శాతం ఇథనాల్ ఆధారిత ఇంధనం వినియోగానికి చట్టబద్ధ అనుమతి లభించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, E100 ఫ్యూయల్ వినియోగానికి సంబంధించిన నిబంధనల ఫైల్‌పై సంతకం చేసినట్లు ప్రకటించారు. దీంతో భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల యుగానికి మార్గం సుగమమైంది.

Continues below advertisement

ఇటీవలే ఢిల్లీలో E85 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మరింత ముందడుగు వేస్తూ E100 ఫ్యూయల్‌కు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడం విశేషం. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ వినియోగం విస్తరిస్తుండగా, భవిష్యత్తులో మరింత అధిక ఇథనాల్ మిశ్రమాలతో నడిచే వాహనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

E100 ఫ్యూయల్‌కు అధికారిక అనుమతి

Continues below advertisement

నాగ్‌పుర్‌లో నిర్వహించిన 'షుగర్, ఇథనాల్ అండ్ బయో ఎనర్జీ ఇండియా కాన్ఫరెన్స్‌'లో మాట్లాడిన నితిన్ గడ్కరీ, E100 ఇంధన వినియోగానికి సంబంధించిన నియమావళిని తాను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో.. ఇథనాల్‌ను ప్రధాన ఇంధనంగా ఉపయోగించే వాహనాల అభివృద్ధికి చట్టపరమైన మార్గం ఏర్పడింది.

ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ, హైబ్రిడ్ వాహనాలకు మాత్రమే ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాధాన్యం ఉండగా, ఇకపై ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.

త్వరలో కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు

ఇప్పటికే మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ WagonRను ప్రదర్శించింది. హీరో మోటోకార్ప్ కూడా ఇథనాల్ ఆధారిత మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. గడ్కరీ చెప్పిన ప్రకారం... టయోటా, సుజుకి, హ్యుందాయ్, ఎంజీ వంటి ప్రముఖ కంపెనీలు మరో నెలన్నరలోనే E100 అనుకూల వాహనాలను విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు, ఇథనాల్‌కు అనుకూలమైన ఫ్యూయల్ సిస్టమ్‌లపై పెట్టుబడులను మరింత పెంచే అవకాశం కల్పిస్తుంది. అధిక ఇథనాల్ మిశ్రమాలతో పనిచేసే వాహనాలకు ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్, ప్రత్యేక ఫ్యూయల్ లైన్లు, ఇతర సాంకేతిక మార్పులు అవసరమవుతాయి.

ఇంకా సవాళ్లు ఉన్నాయి

అయితే E100 ఫ్యూయల్‌కు అనుమతి లభించినంత మాత్రాన వెంటనే అన్ని వాహనాలు దీనిని వినియోగించలేవు. ప్రస్తుతం E20కు అనుకూలంగా ఉన్న వాహనాల్లో నేరుగా E100 నింపడం సాధ్యం కాదు. ఇందుకు ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్, ప్రత్యేక ఫ్యూయల్ సిస్టమ్ అవసరం.

మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రత్యేక E100 ఫ్యూయల్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను కూడా ఎథనాల్ లక్షణాలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది.

మైలేజ్‌పై ప్రభావం ఉంటుందా?

ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల E100 ఫ్యూయల్‌పై నడిచే వాహనాలు అదే దూరం ప్రయాణించేందుకు ఎక్కువ ఇంధనం వినియోగించే అవకాశం ఉంది. అంటే మైలేజ్ కొంత మేర తగ్గే అవకాశాన్ని నిపుణులు చెబుతున్నారు.

దేశానికి ప్రయోజనం ఏమిటి?

ఈ చర్యతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది. దీంతో రైతులకు అదనపు ఆదాయం, దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అనే రెండు ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయి.

E100 ఫ్యూయల్ విజయవంతం కావాలంటే వాహనాల లభ్యత, ఇంధన స్టేషన్ల మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అంగీకారం కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో భారత ఆటోమొబైల్ రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఎంత ప్రభావం చూపుతాయో ఆసక్తిగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.