E20 may decrease mileage: E20 పెట్రోల్ వినియోగంతో కొన్ని వాహనాల్లో ఇంధన మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం & సహజ వాయు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు అంతకంటే ఎంతో ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన ప్రక్రియ, ఇంజిన్ పనితీరు మెరుగుదల, తక్కువ కాలుష్య ఉద్గారాలు & దేశ ఇంధన భద్రత బలోపేతం వంటి ప్రయోజనాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది.
E20పై వస్తున్న విమర్శలకు సమాధానంగా కేంద్రం శుక్రవారం విస్తృత ప్రశ్నలు-సమాధానాల రూపంలో వివరణ విడుదల చేసింది. అందులో E20ను E10 లేదా సాధారణ పెట్రోల్ కంటే మరింత నాణ్యమైన, పరిశుభ్రమైన & సమర్థవంతమైన ఇంధనంగా పేర్కొంది. వాహన తయారీ సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరీక్ష ఏజెన్సీలు & ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతే దేశవ్యాప్తంగా E20 అమలు చేసినట్లు తెలిపింది.
ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని ప్రభుత్వం హఠాత్తుగా అమలు చేయలేదని కూడా స్పష్టం చేసింది. భారత్లో ఈ కార్యక్రమం 2001లో పైలట్ ప్రాజెక్టుల రూపంలో ప్రారంభమైందని, 2006 నాటికి కొన్ని ప్రాంతాల్లో 5 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సరఫరా మొదలైందని గుర్తు చేసింది. 2014 వరకు ఇథనాల్ మిశ్రమం సగటున 1.5 శాతం వద్దే ఉండగా, 2018లో జాతీయ బయోఫ్యూయల్స్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉత్పత్తి వేగంగా పెరిగిందని పేర్కొంది. చెరకు మాత్రమే కాకుండా ఇతర ముడి పదార్థాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల లక్ష్య సాధన వేగవంతమైందని వివరించింది.
ఇది కూడా చదవండి: టెక్టాన్ వర్సెస్ డస్టర్ - ఒకే రూపంతో ఉన్న కవల SUVలు; డిజైన్ నుంచి ధర వరకు పూర్తి కంపారిజన్
2022లోనే 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని గడువుకంటే ముందే సాధించిన భారత్, 2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 20 శాతం మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక ఇథనాల్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు & సరఫరా మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.
పాత వాహనాలపై వ్యక్తమవుతున్న సందేహాలకూ కేంద్రం వివరణ ఇచ్చింది. E20 అమలుకు ముందు ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థ, లోహ భాగాల అనుకూలత, తుప్పు నిరోధకత, వాహనం పనితీరు & కాలుష్య ఉద్గారాలపై విస్తృత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. వాస్తవ వినియోగ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని పేర్కొంది.
మారుతి సుజుకి & హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థల నుంచి అందిన సమాచారాన్ని కూడా కేంద్రం ప్రస్తావించింది. E20 వాడకం వల్ల తుప్పు పట్టడం, విడిభాగాలు అసాధారణంగా దెబ్బతినడం లేదా వాటి జీవితకాలం తగ్గడం వంటి సమస్యలు నమోదుకాలేదని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: భారత్లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్
దేశవ్యాప్తంగా ప్యూర్ పెట్రోల్, E10 & E20లను ఒకేసారి అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లను కూడా కేంద్రం తిరస్కరించింది. లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో మూడు రకాల ఇంధనాలను వేర్వేరుగా నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల లాజిస్టిక్స్ వ్యయం భారీగా పెరుగుతుందని & సరఫరా వ్యవస్థ క్లిష్టంగా మారుతుందని వివరించింది.
E20 ధరపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కొనుగోలు ధరలను రైతులకు గిట్టుబాటు కలిగేలా నిర్ణయిస్తుండటంతో, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన సందర్భాల్లో కూడా E20 తప్పనిసరిగా తక్కువ ధరలో లభిస్తుందని చెప్పలేమని పేర్కొంది. ఈ కార్యక్రమం లక్ష్యం పెట్రోల్ ధరలు తగ్గించడం కాదని, విదేశీ ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడం & ధరల స్థిరత్వాన్ని పెంచడమేనని స్పష్టం చేసింది.
2014-15 నుంచి అమలవుతున్న ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల దేశానికి రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని కేంద్రం వెల్లడించింది. దాదాపు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని, 952 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని తెలిపింది. అలాగే రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని వివరించింది. E20పై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని వినియోగదారులకు సూచించిన కేంద్రం, ఈ ఇంధనాన్ని వాహన తయారీ సంస్థలు, పరీక్ష సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు & నియంత్రణ సంస్థలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేశామని మరోసారి స్పష్టం చేసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
